
లోతైన దుక్కులతో ఎంతో మేలు
కడప అగ్రికల్చర్ : రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, రైతులందరూ లోతైన దుక్కులు చేసుకోవాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాగు చేసే పంటలకు సంబంధించి విత్తన ఎంపిక ఎంతో ముఖ్యమన్నారు. పంటల సాగుకు ముందు కచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. భారత నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ మంగేష్ దుబే మాట్లాడుతూ ఖరీఫ్ పంటల సాగుకు ముందు రైతులు అధికారుల సూచనలు, సలహాలను పాటించాలన్నారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులు తక్కువ పెట్టుబడితో నేల సమతుల్యతను కాపాడే విధంగా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు. ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వ్యాధులు, టీకాలు, అలాగే గొర్రెలు, మేకల పెంపకంలో జాగ్రత్తల గురించి వివరించారు. ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి జ్యోతిర్మయి ఉద్యాన రంగంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ కే.సాయి మహేశ్వరి, డాక్టర్ సురేష్ కుమార్రెడ్డి, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి శైలజ, మండల వ్యవసాయ అధికారి ఈశ్వర్ రెడ్డి, సిబ్బంది తరుణ్, చంద్రారెడ్డి, ఆత్మ ఏటీఎం రైతులు పాల్గొన్నారు.