
దళిత మహిళలపై దాడులను అరికట్టాలి
ప్రొద్దుటూరు : దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టాలని రాష్ట్ర మాలమహానాడు కమిటీ జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయేల్ తెలిపారు. శనివారం స్థానిక పాత బస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర మాలమహానాడు నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై అధికారుల వేధింపులు, దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రతి నెల ఆర్డీఓ సమక్షంలో దళిత వాడల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా స్పందన కార్యక్రమంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా జిల్లాకు ఒక అధికారిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్, గౌరవాధ్యక్షుడు సుద్దపల్లి మురళీప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గున్నంపాటి వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెల్లికట్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని శాంతినగర్ బ్రిడ్జిపై శనివారం రాత్రి కడప వైపు నుంచి వస్తున్న లారీని తిరుపతికి వెళ్తున్న మ్యాక్స్ వాహనం ఢీ కొనడంతో డ్రైవర్ షీర్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు.