
చంద్రారెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు
కడప కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల వీడియో, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు పద్మప్రియ చంద్రారెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ మేరకు ఆయనకు తమిళనాడు వీడియో అండ్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని అన్ని వర్గాల ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సహాయ సహకారాలతో రాష్ట్ర ఉమ్మడి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ సంఘాల కోసం అంకిత భావంతో పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని తెలుగు వారు తమిళనాడు వారితో కలిసి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
మాజీ జెడ్పీ చైర్మన్ సీఎం బలరామిరెడ్డి మృతి
కొండాపురం : ఉమ్మడి కడప జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సీఎం బలరామిరెడ్డి(88) శనివారం ఉదయం చైన్నెలో తన నివాసంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మండల కేంద్రమైన కొండాపురానికి చెందిన సీఎం బలరామిరెడ్డి 1937 సంవత్సరంలో జన్మించారు. కొండాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత 1983 నుంచి 1993 వరకు రెండు పర్యాయాలు ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన జెడ్పీ చైర్మన్గా ఉన్న సమయంలో మండలంలో ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన భౌతికకాయానికి ఆదివారం ఉదయం 10 గంటలకు అంతక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు.
బెంగళూరులో సంబేపల్లె యువకుడి మృతి
సంబేపల్లె : ఇందిరా నగర్ కాలనీకి చెందిన సుండుపల్లె సాయి మహేశ్ (21) శుక్రవారం రాత్రి బెంగళూరులో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సాయి మహేశ్ బెంగళూరులో ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బెంగళూరులోని బైపనల్లి రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వేట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు తెలిపారు.

చంద్రారెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు