
కాసులకు కక్కుర్తి
కారాగారంలో..
కారాగారం అంటేనే కట్టుదిట్ట భద్రత.. కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. అయితే కొందరు సిబ్బంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. రూల్స్ బ్రేక్ చేసి డబ్బుకు దాసోహం అవుతున్నారు. రిమాండ్ ఖైదీ బ్యారక్లో ఏకంగా తొమ్మిది సెల్ఫోన్లు దొరికాయంటే సిబ్బంది చేతివాటం ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక బీడీ, సిగరెట్, గుట్కా తదితరాలు ఖైదీలకు చేరుతున్నాయంటే.. వారు ఆమ్యామ్యాలకు ఎంతగా అలవాటు పడ్డారో తెలుసుకోవచ్చు. ఇప్పటికే డిప్యూటీ జైలర్, హెడ్ వార్డర్ సస్పెన్షన్కు గురయ్యారు. అయినా సిబ్బంది తీరు మారలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కడప కేంద్ర కారాగారం కథ.
కడప అర్బన్: సెంట్రల్ జైళ్లలో, సబ్జైళ్లలో జరిగే సంఘటనలు.... కొందరు అవినీతి అధికారుల, సిబ్బంది చేతుల మీదుగా జరుగుతాయనే భావన కేవలం సినిమాల్లోనే చూపిస్తుంటారు. అదంతా రీల్ లైఫ్. కానీ రియల్ లైఫ్లో ఇలాంటి సంఘటనలు సబ్జైళ్లు, కేంద్రకారాగారాల్లో జరగవనీ, భద్రత ఏర్పాట్లు బలంగా ఉంటాయని.. నిరంతరం సీసీ కెమెరాల నిఘా డీజీపీ కార్యాలయం నుంచి ఉంటుందని ప్రజలకు తెలుసు. జైలు, కారాగార అధికారులు కూడా ఇదే చెప్పుకొస్తుంటారు. అయితే .... ఇటీవల కడప కేంద్ర కారాగారంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా కారాగారాల్లో ఏమై నా జరగవచ్చు...ఏమైనా చేసుకోవచ్చు అనే భావన ప్రజల్లో కలుగుతోంది. కొందరు తృతీయ, కింది స్థాయి సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు.
ఖైదీ బ్యారక్లో 9 సెల్ఫోన్లు..
పలుకుబడి ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే ధోరణిలో రిమాండ్ ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి సిబ్బంది డబ్బుకు దాసోహం అవడంతోనే వీరి ఆటలు సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం కేసులో పట్టుబడి రిమాండ్లో వున్న జాకీర్ అనే పి.డి.యాక్ట్ రిమాండ్ ఖైదీ వున్న బ్యారక్లో వారం రోజుల కిందట ఆకస్మిక తనిఖీలలో సెల్ఫోన్ దొరికింది. ఇప్పటివరకు అదే ఖైదీ దగ్గర 9 సెల్ఫోన్లు దొరికాయంటే కారాగార అధికారులకే అంతుచిక్కడంలేదు. కారాగార అధికారుల పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తనిఖీల సమయంలో పి.డి.యాక్ట్ రిమాండ్ ఖైదీ జాకీర్ ఎన్ని సెల్ఫోన్లనైనా లోపలికి రప్పించుకుంటాను. అధికారులు సెల్ఫోన్లు లోపలికి రావడాన్ని ఆపలేరంటూ సవాలు విసిరినట్లుగా తెలుస్తోంది. ఇతని వ్యవహారంలో డిప్యూటీ జైలర్ హరినాథ, వార్డెన్ సుబ్బరాయుడులను సస్పెన్షన్ చేశారు. జాకీర్ వద్ద దొరికిన సెల్ఫోన్ను, సిమ్ కార్డును రిమ్స్ పీఎస్లో అప్పగించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
● కావేరి బ్యారక్లో కరుడుగట్టిన నేరస్తులను ఉంచుతారు. వీరికి నేరప్రవృత్తి కలిగిన మనసు వుంటుంది. వారిని బయటకు రానీయరు. కానీ ప్రత్యేక పరిస్థితులు, అనుమతులతో వున్న నేరస్తులను (పి.డి.యాక్ట్ లాంటి రిమాండ్ ఖైదీలు) తుంగభద్ర బ్యారక్లో వుంచుతారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కావేరీ బ్యారక్లో ఉంచాల్సిన నిందితులను తుంగభద్ర బ్యారక్లోనే ఉంచడం ఎంతవరకు సమంజసం? అధికారుల విచక్షణకే వదిలేయాల్సి వుంది. ఇలాంటి విధానాలు తుంగలో తొక్కి అధికారులు ప్రవర్తించే తీరు ఏమేరకు జరుగుతోందో తెలియాల్సివుంది.
● మరోవైపు పెట్రోల్ బంక్లో 24/7 పద్ధతిలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలు షిప్ట్ల రూపంలో విధులను నిర్వహిస్తూ వుంటారు. వీరి విధులను పర్యవేక్షిస్తూ, ఆర్థిక లావాదేవీలను సరిచూసుకునేందుకు కారాగార సిబ్బందిని ఇక్కడ అధికారులు నియమించారు. ఇక్కడ ప్రతిరోజూ బహిరంగంగా అవినీతి జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. పత్రికల్లో వచ్చినా, అధికారులను ప్రశ్నించినా వారు నామమాత్రంగానే పర్యవేక్షణ జరపడం, మరలా యథావిధిగా అదే సిబ్బందిని నియమించి వారి అవినీతిని ప్రోత్సహించడం పలురకాల ఆరోపణలకు తావిస్తోంది.
● కడప కేంద్ర కారాగారంలోని కొందరు అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు, విచారణలు చేపడితే డొల్లతనం బయటపడే అవకాశాలున్నాయి.
కాసులు ఇస్తే ఖైదీలకు ఫోన్కాల్స్..
రిమాండ్ ఖైదీ బ్యారక్లో సెల్ఫోన్లు
కడప కేంద్ర కారాగారంలో ఓ శ్రేణి అధికారుల, సిబ్బంది కక్కుర్తి
ఖైదీల పెట్రోల్ బంకులోనూయథేచ్ఛగా ‘అవినీతి’
ఇప్పటికే డిప్యూటీ జైలర్, హెడ్ వార్డర్ ఇరువురు సస్పెన్షన్
కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం
గుట్కా, రాజాఖైనీ, బీడీలు, సిగరెట్లు సైతం సిబ్బందికి చేతులు తడిపితే ఇక్కడికి సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమాండ్, జీవిత ఖైదీలను చూసేందుకు వచ్చే వారి బంధువులు, స్నేహితులు తమకు తోచినంతగా రూ. 1000 నుంచి రూ.10 వేల వరకు డబ్బులను డిపాజిట్ చేయడం ‘చీటి’ల టోకెన్ల ద్వారా తమవారికి అందేలా చూస్తుంటారు. అంతకుమించి అనధికారికంగా తమకు పరిచయం వున్న వారి ద్వారా ‘ఫోన్ పే’ అకౌంట్ల ద్వారా డబ్బులను అందచేసే విధానాన్ని కొందరు అవినీతి అధికారులు, సిబ్బంది అలవాటుగా మార్చుకున్నారు.
సమగ్రంగా అన్ని సంఘటనలపై విచారణ చేస్తాం
కడప కేంద్ర కారాగారంలో జాకీర్ అనే రిమాండ్ ఖైదీ వద్ద మాత్రమే సెల్ఫోన్ దొరికింది. పెట్రోల్ బంక్ నిర్వహణను ప్రత్యేకంగా ఓ డిప్యూటీ జైలర్కు అప్పగించాం. అన్ని రకాల సంఘటనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి విచారణ చేస్తున్నాం. ఇప్పటికే డిప్యూటీ జైలర్ను, వార్డర్ను సస్పెండ్ చేశాం. సెల్ఫోన్ను పోలీస్స్టేషన్లో అప్పగించాం. సిగరెట్లు, బీడీలు, ఇతర గుట్కా సంబంధిత వాటి సరఫరా జరగడంలేదు. సమగ్రంగా విచారణ చేస్తున్నాం. – రాజేశ్వరరావు, సూపరింటెండెంట్, కడప కేంద్ర కారాగారం

కాసులకు కక్కుర్తి

కాసులకు కక్కుర్తి

కాసులకు కక్కుర్తి