కోదాడ : వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. చివ్వెంల మండలం తిర్మలగిరికి చెందిన మట్టిపల్లి సాయిసంపత్(27) మోతె గ్రామానికి చెందిన సామ లింగారెడ్డి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వరి పొలానికి నీరు పెట్టడానికి సాయిసంపత్ బైక్పై పొలం వద్దకు వచ్చాడు. రాత్రయినా అతడు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా బైక్ పొలం పక్కన కనిపించింది. టార్చ్లైట్ వేసి చూడగా పొలం పక్కన సాయిసంపత్ విగతజీవిగా కనిపించాడు. మృతుడి కాళ్లకు విద్యుత్ వైరు చుట్టుకొని ఉండటంతో విద్యుదాఘాతంతో మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. మృతుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజయ్కుమార్ తెలిపారు.
ఫంక్షన్హాల్లో పనికి వెళ్లి..
గరిడేపల్లి : ఫంక్షన్హాల్లో పనికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డిపల్లి గ్రామానికి చెందిన అనంతు లింగయ్య(48) అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్హాల్లో శనివారం పనికి వెళ్లాడు. సాయంత్రం విద్యుత్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


