తుర్కపల్లి: మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. సమాచారం మేరకు తుర్కపల్లి ఎస్ఐ మహమ్మద్ తఖియోద్దీన్ తన సిబ్బందితో కలిసి ఎల్లమ్మ గుడి సమీపంలో ఐదుగురు అనుమానితుల ను తనిఖీ చేశారు. ఈమేరకు తుర్కపల్లి మండలానికి చెందిన ఒగ్గుబాబు, జూకంటి సత్యం, ఒగ్గు నవీన్కుమార్, జూకంటి శివకుమార్, బొమ్మలరామారాం మండలం దీరా వత్ దేవేందర్ వద్ద 200 గ్రామల గంజాయి ఉండగా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. గంజాయిని కలకత్తా నుంచి కొనుగోలు చేసి మాదాపూర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద బైక్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దాబాలో నగదు చోరీ
చివ్వెంల(సూర్యాపేట) : మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట ఉన్న దాబాలో బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తి నగదు చోరీ చేశాడు. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన కాసుల రామన్న అక్కలదేవిగూడెం గ్రామ శివారులో దాబా నిర్వహిస్తున్నాడు. అతను మంగళవారం రాత్రి 12 గంటల వరకు దాబాలో ఉండి అనంతరం ఇంటికి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి కౌంటర్లో ఉన్న నగదు, సిగరెట్ ప్యాకెట్లు కనిపించలేదు. కౌంటర్లో ఉన్న రూ.13 వేల నగదు చోరీకి గురైందని వాపోయాడు. చోరీకి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు.
బావిలో పడిన
వరికోత మిషన్
పెన్పహాడ్: మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు వరికోత మిషన్ బావిలో పడింది. గ్రామానికి చెందిన దేవరం ప్రభాకర్రెడ్డి వరికోత మిషన్తో అదే గ్రామంలో జెర్రిపోతుల ప్రభాకర్కు చెందిన వరి పొలాన్ని కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ వరికల్లు సైదులు అప్పటికే పక్కకు దూకడంతో అతడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 14 ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నల్లగొండ ప్రాంతీయ సమన్వయ అధికారి బి.జానునాయక్ బుధవారం తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్, ఐఐటీ, నీట్, ఏఐఐఎంఎస్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


