గుండాల : గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలోని రెండు ఇళ్లల్లో మంగళవారం రాత్రి బంగారం, వెండి, నగదును చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నత్తి యాకమ్మ ఇటీవల హైదరాబాద్లోని తన కుమారుడి ఇంటికి వెళ్లింది. అదేవిధంగా మచ్చ దీవనమ్మ మంగళవారం రాత్రి నిద్రపోవడానికి తన కుమారుడికి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నత్తి యాకమ్మ ఇంట్లో రూ.10 వేల నగదు, 6 తులాల వెండి పావు తులం బంగారం, దీవెనమ్మ ఇంట్లో రూ.3 వేలు, అర తులం బంగారంతో పాటు 20 తులాల వెండిని అపహరించాడు. మచ్చ దీవెనమ్మ ఉదయం తన ఇంటికి వచ్చి చూడగా తలుపులు విరగ్గొట్టి, బీరువా తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు క్లూస్ టీమ్తో గ్రామానికి చేరుకొని చోరీ జరిగిన ఇళ్లల్లో పరిశీలించారు. అనుమానితుడైన గడ్డం రామును పట్టుకుని విచారణ చేయగా.. తానే దొంగతనం చేసినట్లు అతను అంగీకరించాడు. యాకమ్మ, దీవెనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తేజమ్రెడ్డి తెలిపారు.


