చిన్నారులకు అల్పాహారం!
కేంద్రాల్లో తగ్గుతున్న చిన్నారులు
ఇంకా ఉత్తర్వులు రాలేదు
అడ్డగూడూరు : అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం, ఉడికించిన కోడి గుడ్డు, బాలామృతం అందిస్తున్నారు. ఉదయం పూట అల్పాహారం ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈపథకం అమలైతే జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని 11,900 మంది చిన్నారులకు ప్రయోజనం కలగనుంది.
రోజుకో రుచితో..
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఉదయం పూట రోజుకో రుచికరమైన అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చిన్నారులకు ఉదయం ఉప్మా, కిచిడి ఇలా వివిధ రకాలతో అల్పాహార పదార్థాలను అందజేయడంపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దృష్టిసారించింది. చిన్నారులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో రాజీలేకుండా తెలంగాణ పుడ్స్ ద్వారా సిద్ధం చేసిన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వనున్నారు. మొదట ఈ పథకాన్ని రాష్ట్ర రాజధాని కేంద్రంలో ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు.
ఫ అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
ఫ ఉదయం ఉప్మా, కిచిడీ అందించేలా కసరత్తు
ఫ పథకం అమలైతే 11,900 మంది పిల్లలకు ప్రయోజనం
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పిల్లలు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న తల్లిదండ్రులు వారిని పూర్వ ప్రాథమికవిద్య కోసం ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు.. తల్లిదండ్రులను కలిసి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని కోరుతున్నా వారు సానుకూలంగా స్పందించడం లేదు. కేంద్రాల నుంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటున్న పిల్లలను సైతం పంపడానికి శ్రద్ధకనబర్చడం లేదు. అల్పాహారం పథకం అమలు చేస్తే కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య పెరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆట పాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందుబాటులోకి తెచ్చి తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
అంగన్వాడీ కేంద్రాలో అల్పాహారం అందించే విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఈపథకాన్ని పక్కాగా అమలు చేయడానికి కృషి చేస్తాం.
–నర్సింహారావు, డీడబ్ల్యూఓ


