పెద్దదేవులపల్లి వద్ద పుల్లయ్య మృతదేహం లభ్యం
త్రిపురారం : నిడమనూరు మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య మృతదేహం మంగళవారం పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో లభ్యమైంది. రెండు రోజుల క్రితమే పోలీసులు కారును కాల్వలో నుంచి బయటకు తీయగా.. అందులో పుల్లయ్య భార్య పద్మ మృతదేహం మాత్రమే లభ్యమైంది. పుల్లయ్య ఆచూకీ లభించలేదు. దీంతో నిడమనూరు పోలీసులు ప్రత్యేక బోటులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఎడమ కాల్వతో పాటు పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టగా.. పెద్దదేవులపల్లి రిజర్వాయర్లో పులయ్య మృతదేహన్ని గుర్తించి బయటకు తీశారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం బంధువులు గ్రామంలో పుల్లయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


