ఫ గిరిప్రదక్షిణ
నేటి సమాజానికి
రచయితలు అవసరం
రామగిరి(నల్లగొండ) : నేటి సమాజానికి రచయితలు అవసరమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. నల్లగొండ పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ భవనంలో ఆదివారం నిర్వహించిన భూతం విమల స్మారక జాతీయ పురస్కార అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రచయిత్రి స్వర్ణ కిలారికి రూ.5116, జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో గురుతరమైన బాధ్యత రచయితలదని, కవులు రచయితలు నిరంతరం సామాజిక సమస్యలపై స్పందిస్తూ తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. రచయిత భూతం ముత్యాలు సతీమణి విమల స్మారకార్థం పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక రచయితకు పురస్కారాన్ని ప్రధానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సభ అధ్యక్షుడు తండు కృష్ణకౌండిన్య, అవార్డు కమిటీ చైర్మన్ భూతం ముత్యాలు, ఆచార్య బన్న ఐలయ్య, డాక్టర్ జివి రత్నాకర్, మునాసు వెంకట్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, పగడాల నాగేందర్, సిద్ధాంతి యాదగిరి, నిమ్మ బాబురావు తదితరులు పాల్గొన్నారు.


