9, 10 తేదీల్లో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు
భువనగిరి: ఈ నెల 9,10 తేదీల్లో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, చెస్, క్యారమ్, ఇండోర్స్టేడియంలో తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. 10న అథ్లెటిక్స్ పోటీలతో పాటు ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్, కిక్బాక్సింగ్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు మాత్రమే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు.
యాదగిరీశుడి సన్నిధిలో నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేశారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
చిన్నమేడారం హుండీల లెక్కింపు
రాజాపేట : రాజాపేట మండలంలోని చిన్నమేడారం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు గురువారం చేపట్టారు. రూ.5.80 లక్షల నగదు సమకూరగా.. దర్శనాలు, తలనీలాలు, బెల్లం, వివిధ షాపులకు వేసిన వేలం పాటలో రూ.9 లక్షలు వచినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, జాతర నిర్వహణ ఖర్చులు రూ.12 లక్షలు అయినట్లు వెల్లడించారు.
క్రీడలతో మానసికోల్లాసం
ఆలేరురూరల్ : క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని కొలనుపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు సాధన చేస్తే జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగవొచ్చని తెలిపారు. కాగా, ఈ పోటీల్లో సుమారు 650 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి, హెచ్ఎం వేణుగోపాల్, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, ఉప సర్పంచ్ గొట్ట జితేందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న యూరియా అడ్డగింత
ఆత్మకూరు(ఎం): ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని పీఏసీఎస్ నుంచి యూరియా బస్తాలను అక్రమంగా తరలిస్తుండగా రైతులు గమనించి గురువారం అడ్డుకున్నారు. గురువారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని పీఏసీఎస్కు యూరియా లోడు వచ్చింది. అంతకు ముందే సోమవారం యూరియా కావాల్సిన రైతులు 200 మంది తమ పేర్లను లిస్టులో రాయించుకున్నారు. అయితే లిస్టులో పేర్లు రాయించుకోని ముగ్గురు రైతులు 30 యూరియా బస్తాలను ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా రైతులు గమనించి నిలదీశారు. దీంతో వారు ట్రాక్టర్లోని 30 యూరియా బస్తాలను అన్లోడ్ చేసి వెళ్లిపోయారు. థంబ్ వేయకుండానే యూరియా బస్తాలను ఎందుకు ఇచ్చారని రైతులు పీఏసీఎస్ సిబ్బందిని నిలదీశారు. ఈ విషయమై సీఈఓ యాస కిరణ్రెడ్డిను వివరణ కోరగా ఆరుగురు రైతులు కలిసి ఒక ట్రాక్టర్ తెచ్చుకుని యూరియా బస్తాలను తీసుకెళ్లినట్లు తెలిపారు.
9, 10 తేదీల్లో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు


