బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యే
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దౌర్జన్యాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి ఆరోపించారు. విప్ ఐలయ్య ఆదేశాలతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కంసాని కీర్తి ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి, భయాందోళనకు గురిచేసిన విషయం తెలుసుకున్న గొంగిడి సునిత బుధవారం ఉదయం అభ్యర్థిని కలిసి వివరాలు తెలుసుకొని, ఈ అంశంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బ్లాక్మెయిలింగ్ చేయడంతో పాటు మానసికంగా టార్చర్ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి విరమించుకునేలా చేస్తున్నారన్నారు. అర్ధరాత్రిదాటిన తరువాత అభ్యర్థి కీర్తి స్వామిల ఇంట్లోకి పోలీసులమని గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి క్షుణ్ణంగా తనిఖీ చేసి, స్వామి ఎక్కడున్నాడు ఆయన కావాలని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. 11వ వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడిని ఐలయ్య బెదిరింపులకు పాల్పడి పోటీ నుంచి తప్పించారన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన సయ్యద్ బాబాను సైతం పోటీలో ఉండొద్దని, ప్రచారం చేయొద్దని ఫోన్లు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. 10వ వార్డులో బీఆర్ఎస్ తరఫున నిలిచిన ఆవుల మమత సాయి యాదవ్కు రూ.3కోట్లు ఇచ్చి, భయపెట్టి నామినేషన్ విత్డ్రా చేయించారని చర్చ జరుగుతోందన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మండల జనరల్ సెక్రటరీ కసావు శ్రీనివాస్గౌడ్, బాహుపేట సర్పంచ్ కవిడే మహేందర్, బండ సిద్దులు, లింగం యాదవ్, కంసాని స్వామి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్రెడ్డి
బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తున్న ఎమ్మెల్యే


