నిందలు వేస్తే సహించేది లేదు
హయత్నగర్: మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి హయాంలో జరిగిన అవకతవకల కారణంగానే మదర్ డెయిరీకి అప్పుల భారం పెరిగిందని, అవినీతి వాళ్లు చేసి తమపై నిందలు వేస్తే సహించేది లేదని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను తప్ప ఎవరూ మదర్ డెయిరీని నడపరాదని జితేందర్రెడ్డి కుట్ర చేస్తున్నారని, ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు తెస్తానని చెప్పి రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆయన చేసిన ఆరోపణలు నిరూపిస్తేనే సర్వసభ్య సమావేశం పెడతానని, ఎవరి సమక్షంలో విచారిస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో గేదెలు, దాణా కొనుగోలుకు ఇన్సెంటివ్లకు ఇచ్చిన సబ్సిడీల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జితేందర్రెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తానని, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వం నుంచి సహాయం కోరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నర్సింహారెడ్డి, పాండు, రాంరెడ్డి, జంగయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల వాగ్వాదం
రెండు నెలలకు పైగా జీతాలు ఇవ్వడం లేదని మదర్ డెయిరీ ఉద్యోగులు మంగళవారం చైర్మన్, డైరెక్టర్లతో వాగ్వాదానికి దిగారు. పాలు వస్తున్నాయి, పని చేస్తున్నాం, డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు జీతాలు చెల్లిస్తానని చైర్మన్ హామీ ఇచ్చినా ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు.
ఫ మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి


