మళ్లీ పులి దాడి కలకలం
రాజాపేట : మళ్లీ పులి సంచారం కలకలం రేపింది. రాజాపేట మండలంలో పులి తిరిగిన ఆనవాళ్లు కన్పించడం, ఒక లేగదూడను చంపడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల17న బేగంపేట గ్రామంలో పులి అడుగులను గుర్తించిన విషయం విదితమే. తాజాగా సోమవారం రాత్రి బసంతపురంలో కట్కూరి రమేష్ వ్యవసాయ బావి వద్ద లేగదూడపై దాడి చేసి చంపింది. అక్కడి నుంచి నెమిల మధిర గ్రామం పిట్టలగూడెం శివారులో, లక్ష్మక్కపల్లి గ్రామ సర్పంచ్ ఇండ్ల రాజయ్య వ్యవసాయ పొలంలో పులి అడుగు జాడలను ప్రజలు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
ఫారెస్టు అధికారులు
బసంతపురంలో పులి దాడిచేసి చంపిన లేగదూడను, పిట్టలగూడెం, లక్ష్మక్కపల్లి గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో రైతులు గుర్తించిన పులి అడుగుల ఆనవాళ్లను యాదాద్రి, సిద్దిపేట జిల్లాల ఫారెస్టు అధికారులు సుధాకర్రెడ్డి, పద్మజ.. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. రమేష్ నాయక్, డి. శ్రీను, బీట్ ఆఫీసర్లు స్వామి, కిషోర్, శేఖర్రెడ్డి, లిఖిత, సెక్షన్ ఆఫీసర్లు మల్లేశం, జి లక్ష్మణ్లు యానిమల్ ట్రాకర్స్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
శ్రీనివాస్పురంలో పులి పాద ముద్రలు
ఆలేరురూరల్: ఆలేరు మండలం శ్రీనివాస్పురంలో దడిగోని వ్యవసాయ బావి వద్ద పులి పాదముద్రలను స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వచ్చి పరిశీలించి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ పులిని పట్టుకునేందుకు నాలుగైదు రోజులుగా టైగర్ మానిటరింగ్ టీమ్తో కలిసి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట అటవీశాఖ అధికారులు, ఆలేరు సీఐ యాలాద్రి, పోలీసులు ఉన్నారు.
పులిని బంధించేందుకు ప్రత్యేక చర్యలు
రాజాపేట : పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో బంధించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. రాజాపేట మండలం బసంతపురం గ్రామంలో పులి దాడి చేసి లేగదూడను చంపిన ప్రాంతాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఫారెస్టు అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులిని పట్టుకోవడానికి ధర్మల్ డ్రోన్ ఉపయోగించి పులి సంచరిస్తున్న ప్రదేశాలను వీడియో తీయడం, ట్రాప్ కెమెరా, బోన్ల ఏర్పాటు వంటి అంశాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, వ్యవసాయ పనుల నిమిత్తం గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రి వేళలో పశువులను బయటికి వదలవద్దని పశువుల పాకలో వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పులి కనిపించినట్లు గమనించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక గ్రామ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రదీప్కుమార్, ఎంపీడీఓ నాగవేణి, ఆర్ఐ నర్సింహులు, గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ ఉన్నారు.
బసంతపురంలో పులి దాడితో మృతి చెందిన లేగదూడను పరిశీలిస్తున్న అధికారులు
లక్ష్మక్కపల్లి గ్రామంలో పులి పాదముద్ర
ఫ రాజాపేట మండలం బసంతపురంలో లేగదూడపై దాడి
ఫ మరో మూడు గ్రామాల్లో అడుగు జాడలు
మళ్లీ పులి దాడి కలకలం
మళ్లీ పులి దాడి కలకలం


