టీశాట్ పాఠం.. ఉత్తమ ఫలితాలకు ఊతం
సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు
భువనగిరి: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) టీ శాట్ ద్వారా ప్రత్యేకంగా పాఠాలను ప్రసారం చేసే కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. ఇది ఈనెల 5వ తేదీరకు కొనసాగనుంది. ఇప్పటికే జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 200 సైకిళ్లను అందజేస్తామని ఇప్పటికే కలెక్టర్ హనుమంతరావు ప్రకటించారు.
ఉదయం 9.30 నుంచి
సాయంత్ర 4.30 వరకు..
టీ శాట్ ద్వారా రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రత్యేక పాఠాలను విషయ నిపుణులు బోధిస్తారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భౌతిక, జీవశాస్త్రం, ఇంగ్లిష్, హిందీ, బోధన పూర్తి కాగా ఈ నెల 4వ తేదీన గణితం, తెలుగు, సాంఘిక శాస్త్రం, ఉర్దూ భాషలో గణిత, భౌతిక, జీవ శాస్త్రం, సాంఘిక శాస్త్రాల పై పాఠాలు ప్రసారం చేయనున్నారు.
180 పాఠశాలల్లో..
జిల్లా వ్యాప్తంగా 180 ప్రభుత్వ పాఠాశాలలు ఉండగా వీటిలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 5464 మంది ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాదించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా కలెక్టర్ విద్యాశాఖ సమన్వయంతో వినూత్న కార్యక్రమాలను అమలుచేశారు. దీంతో గత సంవత్సరం పదో తరగతి ఫలితాలలో రాష్ట్రంలో జిల్లా 7వ స్థానంలో నిలిచింది. 2025–26 సంవత్సరానికి గత సంవత్సరం కంటే రాష్ట్రంలో వచ్చిన స్థానాన్ని మరింతగా మెరుగుపర్చుకునేందుకు తాజాగా జట్టు అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనికి తోడు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో టీశాట్ ద్వారా ప్రసారం చేస్తున్న పాఠాలతో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదం కానున్నాయి.
జిల్లాలో గతంలో సాధించిన
ఉత్తమ ఫలితాల వివరాలు
సంవత్సరం శాతం రాష్ట్రంలో
స్థానం
2021–22 93.61 13
2022–23 80.97 23
2023–24 90.44 25
2024–25 97.80 7
పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో టీ శాట్ ద్వారా ప్రత్యేకంగా పాఠాలు ప్రసారం చేస్తుండడం వల్ల విద్యార్థుల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– కె సత్యనారాయణ, డీఈఓ
ఫ పదో తరగతి విద్యార్థులకు టీశాట్ ద్వారా పాఠాల ప్రసారం ప్రారంభం
ఫ 5వ తేదీ వరకు నిర్వహణ
ఫ 5,464 మంది విద్యార్థులకు ప్రయోజనం


