కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోంది
యాదగిరిగుట్ట: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తోందని, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమతకు రూ.3కోట్లు ఇచ్చి నామినేషన్ విత్ డ్రా చేయించారని బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమత నామినేషన్ ఉపసంహరించేందుకు నగదు ఇచ్చారని, ఇతర బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పట్టణమంతా తిరుగుతూ బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఐలయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్లు చేయడంతో పాటు ఆయన అనుచరులను ఇళ్లకు పంపించి నగదు ఆశ చూపుతున్నారన్నారు. 11వ వార్డు అభ్యర్థి సయ్యద్ బాబా, 12వ వార్డు అభ్యర్థి కంసానీ కీర్తి స్వామి, 5వ వార్డు అభ్యర్థి మానుపాటి పరుశరాములును బెదిరింపులకు పాల్పడ్డారని, నామినేషన్ ఉసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. 11వ వార్డు అభ్యర్థికి కాంగ్రెస్కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ఫోన్ చేసి విత్ డ్రా చేసుకుంటే నగదు ఇప్పుడే మాట్లాడి అప్పగిస్తామని ఆఫర్ చేసినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి డబ్బులకు లొంగలేదన్నారు. యాదగిరిగుట్ట పట్టణ ఓటర్లు ఆలోచించి నిజాయితీగా అభివృద్ధి చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. కాగా.. నమ్మిన వ్యక్తులే పార్టీకి ద్రోహం చేస్తున్నారని ప్రెస్మీట్ సమయంలో గొంగిడి మహేందర్రెడ్డి కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, నాయకులు ఇమ్మడి రాంరెడ్డి, తోటకూరి బీరయ్య, గంగసాని నవీన్కుమార్, శారాజీ రాజేష్, కవిడే మహేందర్, నర్సింహగౌడ్, వెంకటేష్గౌడ్, రమేష్, దావూద్, కరుణాకర్, సతీష్రాజ్ తదితరులున్నారు.
ఫ బీఆర్ఎస్ అభ్యర్థికి రూ.3కోట్లు ఇచ్చి నామినేషన్ ఉపసంహరింపజేశారు
ఫ బీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డి ఆరోపణ
కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోంది


