అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పెద్దవూర: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం గ్రామానికి చెందిన జానపాటి బొర్రయ్య–కాశమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు కోటేష్(37) ఉన్నారు. వీరందరికి వివాహాలు అయ్యాయి. కోటేష్కు నిడమనూరు మండలం కుంటిగొర్లగూడెం గ్రామానికి చెందిన హేమలతతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కోటేష్ తల్లి ఎనిమిది సంవత్సరాల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కోటేష్ మద్యానికి బానిసై భార్య, తండ్రిని నిత్యం కొడుతుంటాడు. దీంతో భార్య హేమలత ఇద్దరు పిల్లలతో కలిసి పది నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి సైతం కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి కుమార్తెల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో కోటేష్ తన ఇంటిని సైతం ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టి లోన్ తెచ్చుకున్నాడు. సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో సంబంధిత బ్యాంకు వాళ్లు ఇంటికి తాళం వేసినట్లు తెలిసింది. దీంతో తన వ్యవసాయ పొలంలో రేకుల షెడ్డు వేసుకుని అక్కడే ఉంటున్నాడు. నాలుగైదు రోజుల క్రితం తన ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టిన కోటేష్ ఇంట్లోనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం కుమార్తెల వద్ద నుంచి ఇంటికి వచ్చిన తండ్రిని కోటేష్ తాగొచ్చి కొట్టడంతో మరలా కుమార్తెల వద్దకు వెళ్లాడు. గురువారం రాత్రి కోటేష్ స్నేహితుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కోటేష్ మంచంపై రక్తం మడుగులో పడి ఉండటం గమనించి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పాడు. నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని చూడగా కోటేష్ గొంతుకోసి ఉన్నట్లు, పక్కనే కూరగాయలు కోసే కత్తి ఉండటం గమనించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


