డబ్లింగ్ ముమ్మరం
బీబీనగర్– నల్లపాడు
మిర్యాలగూడ: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి)–నల్లపాడు రెండో రైల్వేలైన్ (డబ్లింగ్)నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ వరకు రెండు వరుసల రైల్వే లైన్ ఉంది. పగిడిపల్లి స్టేషన్ నుంచి నల్లగొండ, మిర్యాలగూడతోపాటు ఏపీలోని గుంటూరు సమీపంలోని నల్లపాడు వరకు ఒక్క లైన్ మాత్రమే ఉంది. దీంతో ఈ మార్గంలో ఒక రైలు వస్తుంటే మరో బండిని స్టేషన్లోనే నిలపాల్సి వస్తుంది. దీనికితోడు ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే 150శాతానికిపైగా రైళ్లు, గూడ్స్లు తిరుగుతున్నాయి. ఇదే మార్గం గుండా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)కు బొగ్గు రవాణా జరుగుతుండడం, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడం, సికింద్రాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ మార్గంలో కేంద్ర ప్రభుత్వం రెండో రైల్వే లైన్ నిర్మాణాన్ని మంజూరు చేసింది. ఈ మార్గం మొత్తం పొడవు 248 కిలోమీటర్లు ఉండగా తెలంగాణలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 150 కిలోమీటర్లు, ఏపీలో 98 కిలోమీటర్ల పరిధి ఉంది. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ రెండో రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా 10 మేజర్, 259 మైనర్ వంతెనలు నిర్మించనున్నారు. వాడపల్లి–పొందుగుల వద్ద కృష్ణానదిపై రెండో వంతెనను నిర్మించాల్సి ఉంది.
ఇప్పటికే 130 కిలోమీటర్ల మేర పనులు పూర్తి
ఈ మార్గాన్ని ఆరు దశల్లో పూర్తిచేయాలని రైల్వే అధికారులు అంచనాలు రూపొందించారు. మొదటి దశలో విష్ణుపురం– కుక్కడం మధ్య 55 కిలోమీటర్లు, కుక్కడం–వలిగొండ మధ్య 75 కిలోమీటర్లతో కలిపి మొత్తం 130 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి విష్ణుపురం–కుక్కడం మధ్య మట్టికట్ట పనులు పూర్తిచేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. మట్టికట్ట పనులు సగానికిపైగా పూర్తికాగా మైనర్ వంతెన పనులు చేపట్టారు. రెండో లైన్ నిర్మాణానికి 1985 సంవత్సరంలోనే భూసేకరణ చేయగా తాజాగా తెలంగాణలో అదనంగా 65 హెక్టార్ల భూమిని సేకరించారు. రెండో లైన్ నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు మూడు గంటల్లోపే చేరుకోవచ్చు. చైన్నెతోపాటు నెల్లూరు, ఒంగోలు, తిరుపతికి తక్కువ సమయంలోనే చేరవచ్చు.
జంక్షన్గా మారనున్న విష్ణుపురం స్టేషన్..
రెండో రైల్వే లైన్ నిర్మాణంతో ఈ మార్గంలో ఉన్న విష్ణుపురం రైల్వే స్టేషన్ జంక్షన్గా మార్పు చెందనుంది. ఇక్కడి నుంచి మోటుమర్రి రైల్వేలైన్ అనుసంధానం కావడంతోపాటు వైటీపీఎస్కు ఇక్కడి నుంచి రెండు వరుసల రైల్వేలైన్ ఉండడంతో విష్ణుపురం జంక్షన్ కానుంది. మోటుమర్రి–విష్ణుపురం, బీబీనగర్– నల్లపాడు, విష్ణుపురం–వైటీపీఎస్ మార్గాలకు మధ్య ఉండడంతో ఈ స్టేషన్కు జంక్షన్గా మార్చారు. దీనికి తోడు మిర్యాలగూడ, నల్లగొండ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండడంతో ఈ ప్రాంత వాసులకు రైలు ప్రయాణం మరింత చేరువ కానుంది.
ఫ కొనసాగుతున్న రెండో రైల్వేలైన్ పనులు
ఫ ఆరు దశల్లో పనుల పూర్తికి అంచనాలు
ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో
150 కిలోమీటర్లు
ఫ విష్ణుపురం–కుక్కడం మధ్య
డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం
డబ్లింగ్ ముమ్మరం


