వరికి మద్దతు ధర దక్కాలంటే.. | - | Sakshi
Sakshi News home page

వరికి మద్దతు ధర దక్కాలంటే..

Nov 6 2025 11:18 AM | Updated on Nov 6 2025 11:18 AM

వరికి

వరికి మద్దతు ధర దక్కాలంటే..

పెద్దవూర: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి వరికోతలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తుంది. ఇప్పటికే కొన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, మరో వారంలోగా అన్నిచోట్ల ప్రారంభం కానున్నాయి. ఆరుగాలం శ్రమించి వరిపంట పండించిన రైతులు తమ పంటకు ప్రభుత్వ మద్దతు ధర పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించకతప్పదు. ముఖ్యంగా ధాన్యం ఆరబోయకుండా మార్కెట్‌కు తీసుకెళ్తే మద్దతు ధర రాక నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు వరికోతల నుంచి అమ్మకం వరకు తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందవచ్చని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి పి.సందీప్‌కుమార్‌ పేర్కొన్నారు.

కోతకు ముందు, తర్వాత ఇవి పాటించాలి..

● వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతనే కోతలు ప్రారంభించాలి.

● వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసివేయాలి.

● కోతకు 15 నుంచి 20 రోజుల ముందే నీటి తడులు ఆపివేయాలి.

● 1010 రకం వరి గింజలు బంగారు రంగులోకి వచ్చే వరకు ఆగితే రాలిపోతాయి. ఈ ఒక్క రకాన్ని గోధుమ రంగులోకి రాగానే కోయాలి.

● కోసిన వరి మెదళ్లను నాలుగు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి.

● అనంతరం ఒక్కో రకం వరికి వేర్వేరు కల్లాలు చేసి, టార్ఫాలిన్‌లలో వరి మెదలు వేసి ట్రాక్టర్ల ద్వారా నూర్పిడి చేయాలి.

● ఒక రకానికి చెందిన వరి ధాన్యాన్ని మరోరకం వరిధాన్యంతో కలపొద్దు. పొలం వద్దే సరైన గ్రేడింగ్‌ చేయాలి.

● గడ్డిని తీసివేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకల సహాయంతో(తాలు గింజలు) నాణ్యత లేని గింజలు లేకుండా శుభ్రంగా తూర్పారా పట్టాలి.

● ధాన్యంలో 17 శాతంలోపు తేమ ఉండే వరకు ఆరబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే మద్దతు ధర వచ్చే అవకాశాలు ఉంటాయి.

● హార్వెస్టర్‌తో కోస్తే మొదటిసారి పోసే డబ్బాను వేరుగా పోయాలి. ఆ తరువాత కోసినవన్నీ ఒకచోట పోయాలి. ఇలా చేయడం వల్ల కల్తీ ప్రమాదం తప్పుతుంది.

● వడ్లను న్నీ సిమెంట్‌ కల్లాలు లేదా టార్ఫాలిన్‌ షీట్లపై ఆరబెట్టాలి. రెండు, మూడు రోజులు బాగా ఎండేలా కాళ్లతో కలియదున్నాలి.

● పంట కోశాక సరిగా ఆరబెట్టకపోతే గింజలు రంగుమారి, పంట నాణ్యత తగ్గుతుంది.

● పంటను ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టి పెళ్లలు, చెత్తా చెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి.

● నిల్వ చేసే పక్షంలో గోనె సంచులను కింద వేయకుండా కవర్లు పరిచి లేదా బల్లలపై బస్తాలు నెట్టుగా వేయాలి.

● పురుగులు ఆశించకుండా లీటరు నీటికి 5 ఎంఎల్‌ మలాథియాన్‌ మందును కలిపి బస్తాలపై పిచికారీ చేయాలి.

● ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల మధ్య జింక్‌ ఫాస్ఫేట్‌ ట్యాబ్‌లెట్లు ఉంచాలి. ఒకరోజు తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్తలు వహించాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండా పోతాయి. మరుసటి రోజు నుంచి తలుపులు తీయొచ్చు.

నాణ్యతప్రమాణాలు తప్పనిసరి

వరి ధాన్యం ఏ గ్రేడ్‌ రకం క్వింటాకు ప్రభుత్వం 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర దక్కాలంటే రైతులు ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.

● తేమ శాతం 17శాతంలోబడి తాలు 1శాతం, మట్టి పెళ్లలు, రాళ్లు (1.పాడైన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం, 2. పూర్తిగా కాని, ముడుచుకుపోయిన ధాన్యం3.తక్కువరకం మిశ్రమం, ఆరు శాతం లోబడి తదితరవి) లేకుండా చూసుకోవాలి.

రైతులు తీసుకురావాల్సిన పత్రాలు..

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు రైతులు ఆధార్‌ కార్డు జిరాక్స్‌, భూమి పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌, రైతుబంధుకు అనుసంధానమైన బ్యాంకు అకౌంట్‌ బుక్కు జిరాక్స్‌, ఆధార్‌ కార్డుకు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌లను వెంట తెచ్చుకోవాలి. కౌలు రైతులు సైతం ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్కు, కౌలు ఇచ్చిన రైతు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌లతో పాటు ఆధార్‌కార్డుకు అనుసంధానమైన ఫోన్‌నంబర్‌, ఆయ మండలాల వ్యవసాయ అధికారిచే జారీ చేయబడిన కౌలు సర్టిఫికేట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.

ఫ కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తేవాలి

ఫ తేమశాతం 17లోపు ఉండేలా ఆరబెట్టాలి

ఫ వరికోతల నుంచే జాగ్రత్తలు పాటించాలి

వరికి మద్దతు ధర దక్కాలంటే..1
1/1

వరికి మద్దతు ధర దక్కాలంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement