
నీటి సంఘాలకు ఎన్నికలు ఎప్పుడో..?
పెద్దవూర: గత పదిహేడేళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో చెరువులు అధ్వాన్నంగా మారాయి. మరోవైపు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసినా.. వాటిపై అజమాయిషీ లేక నీటి విడుదల, మరమ్మతులపై దృష్టి పెట్టేవారు కరువయ్యారు. ఒకప్పుడు చెరువుల అభివృద్ధి, నిర్వహణ, ఆయకట్టుకు నీటి విడుదల పర్యవేక్షణ పనులను నీటి సంఘాల పాలకవర్గాలు చేపట్టేవి. నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ పర్యవేక్షణ కరువైంది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పనులు చేపట్టకముందే నిధులు కాజేశారన్న ఆరోపణలు వచ్చాయి.
గతంలో ఇలా..
గత ప్రభుత్వాలు 100 ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలకు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేవి. రైతులు నీటి సంఘం చైర్మన్తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో సాగు నీటిని పంట పొలాలకు విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు సైతం చేపట్టేవారు. గత 17 ఏళ్ల నుంచి నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. కొన్ని చెరువుల తూములు, పంట కాలువలు, అలుగులు శిథిలావస్థకు చేరుకున్నాయి. తూములు పనిచేయక సాగునీరు రాక నిరుపయోగంగా మారాయి. చెరువులపై ఎవరి అజమాయిషీ లేకపోవడంతో రైతులకు సాగునీరు అవసరమయ్యే సమయంలో(వానాకాలం సీజన్ ప్రారంభంలో) చేపలు పట్టుకోవడం కోసం రాత్రికి రాత్రే చెరువుల నుంచి నీటిని అక్రమంగా వదిలి ఖాళీ చేస్తున్నారు.
2008 నుంచి ఎన్నికలు బంద్
2006వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా వంద ఎకరాల ఆయకట్టుకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు రెండు సంవత్సరాల కాలానికి గాను సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటినుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చెరువులను మరింత అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.
ఫ చివరిసారిగా 2006లో
ఎన్నికల నిర్వహణ
ఫ పట్టించుకోని ప్రభుత్వాలు
ఫ అధ్వాన్నంగా మారుతున్న చెరువులు

నీటి సంఘాలకు ఎన్నికలు ఎప్పుడో..?