టైగర్‌ దామన్న ఇక లేరు | - | Sakshi
Sakshi News home page

టైగర్‌ దామన్న ఇక లేరు

Oct 2 2025 7:46 AM | Updated on Oct 2 2025 7:46 AM

టైగర్‌ దామన్న ఇక లేరు

టైగర్‌ దామన్న ఇక లేరు

సూర్యాపేట : టైగర్‌ దామన్నగా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో పేరుగాంచిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాలలో ఆయన జన్మించారు. తుంగతుర్తి గ్రామానికి చెందిన ఉప్పునూతల కౌసల్యాదేవి కుమార్తె వరూధినిదేవిని వివాహమాడారు. ఆయనకు కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి స్వయానా సోదరుడు. దామోదర్‌రెడ్డి 1985 నుంచి నేటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకుడిగా పనిచేశారు. పార్టీకి ఎంత కష్ట కాలం వచ్చినప్పటికీ పార్టీని వీడకుండా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో కార్యకర్తలకు అండగా నిలిచారు.

కమ్యూనిస్టుల కంచుకోటలో..

1985 నాటికి తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబల్యంతోపాటు కాంగ్రెస్‌ పార్టీలో అనేక చీలికలు పేలుకలు ఉండడంతో కమ్యూనిస్టులను ఓడించడం ఎవరికి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఎర్రపహాడ్‌ జమీందారు జన్నారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డికి స్వయంగా బావమరిది అయిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దించింది. 1985లో దామోదర్‌రెడ్డి మొదటిసారి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటిదాకా తుంగతుర్తి నియోజకవర్గం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. 1989లో మరోసారి గెలుపొందారు. మూడోసారి 1994లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి సీపీఎం అభ్యర్థిపై విజయం సాధించారు. నాలుగోసారి 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర చేతిలో ఓటమిపాలయ్యారు. తిరిగి 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అదే సంకినేని వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఈసారి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడంతో.. సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిపై విజయం సాధించారు. 1985 నుంచి వరుసగా తుంగతుర్తి నుంచి మూడుసార్లు గెలుపొంది ఒకసారి ఓటమి చవిచూసి మరోసారి గెలుపొంది నాలుగుసార్లు విజయం సాధించారు. అనంతరం సూర్యాపేట నుంచి 2009లో మరోసారి విజయం సాధించి మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985, 1989, 1994లో తెలుగుదేశం మిత్రపక్షాల హవాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలు గెలుపొందగా.. కేవలం తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రమే దామోదర్‌రెడ్డి గెలుపొంది కాంగ్రెస్‌ సత్తా చాటారు. 1985 కంటే ముందు తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టుల హవా కొనసాగి భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యేలుగా పనిచేయగా దామోదర్‌రెడ్డి రంగ ప్రవేశంతో కమ్యూనిస్టుల ప్రాబల్యానికిగండి కొట్టినట్లు అయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీ టైగర్‌ గా పేరుగాంచిన దామోదర్‌ రెడ్డి కనుమూయడంతో తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దదిక్కును కోల్పోయింది.

ఫ హైదరాబాద్‌లో కన్నుమూసిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

ఫ కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపిన నేత

ఫ తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం

ఫ 3న సూర్యాపేటకు పార్థివదేహం

ఫ 4న తుంగతుర్తిలో అంత్యక్రియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement