
‘స్పర్శ్’లో సమస్యలు.. ఉద్యోగుల వెతలు
400 మంది ఉద్యోగులు
సాంకేతిక సమస్యల సాకుతో జీతాలు ఆపవద్దు
పాత విధానంతో వేతనాలు చెల్లించాలి
చౌటుప్పల్ రూరల్: ఉపాధిహామీ ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాలు అందక విలవిలలాడుతున్నారు. నిధులు అందుబాటులో ఉన్నా నూతన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యల వల్ల వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కుటుంబ పోషణ, పిల్లల ఫీజు, ఇంటి అద్దె తదితర అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
కారణాలు ఇవీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే పథకాల కింద విడుదలయ్యే నిధులను పర్యవేక్షించేందుకు కేంద్రం నూతనంగా స్పర్శ అనే డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాలోకి తీసుకువచ్చింది. అయితే యాప్లో సాఫ్ట్వేర్లు అనుసంధానం కాకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో సిబ్బంది వివరాల నమోదులో జా ప్యం చోటు చేసుకొని వేతనాల చెల్లింపుపై ప్రభావం చూపుతోంది. సమస్యను అధికారులు పరిష్కరించకపోవడంతో సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు.
గతంలో పే అండ్ అకౌంట్స్ నుంచి వేతనాలు
ఉపాధిహామీ కాంట్రాక్ట్ సిబ్బందికి గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని పే అండ్ అకౌంట్స్ నుంచి నిధులు ట్రాన్సఫర్ జనరేట్ చేయగానే వెంటనే సిబ్బంది ఖాతాలో జమ అయ్యేవి. స్పర్శ యాప్ ద్వారా ప్రతి నెలా రాష్ట్ర ఖజానా నుంచి మాన్యువల్గా అప్రూవ్ చేస్తేనే సిబ్బంది వేతనాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ యాప్లో సిబ్బంది వివరాలను ప్రతి నెలా అప్లోడ్ చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఉపాధిహామీ సిబ్బందికివేతనాల చెల్లింపులో జాప్యం
ఫ రెండు నెలలుగా పెండింగ్
ఫ ఆర్థిక ఇబ్బందులతో సతమతం
ఫ రాష్ట్రస్థాయి సమస్య అని తేలికగా తీసుకుంటున్న అధికారులు
ఉపాధిహామీ పథకంలోని వివిధ విభాగాల్లో 400 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఇందులో ఏపీఓలు 14మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 13, టెక్నికల్ అసిస్టెంట్లు 66, కంప్యూటర్ ఆపరేటర్లు 39, ఫీల్డ్ అసిస్టెంట్లు 266 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.75 లక్షల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలలుగా సుమారుగా రూ.కోటి 50 లక్షలు బకాయిలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు తమ గోడు చెప్పుకుంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఇది రాష్ట్ర స్థాయి సమస్య అని తేలికగా తీసుకుంటు న్నారని సిబ్బంది వాపోతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చొరవ తీసుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సిబ్బందికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాం. మాకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులను సంప్రదిస్తే స్పర్శ యాప్లో సాంకేతిక సమస్యలున్నాయని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు చూపి వేతనాలు ఆపడం సమంజసం కాదు. దసరా పండుగ ఎలా జరుపుకోవాలి. పండుగ లోపు వేతనాలు చెల్లించాలి.
–తాటిపాముల శ్రీశైలం, టెక్నికల్ అసిస్టెంట్, చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వం స్పర్శ అనే నూతన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను తీసుకురావడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉద్యోగులకు నెలనెలా వేతనాలు రావడం లేదు.గతంలో మాదిరి రాష్ట్ర ఖజానా నుంచి ఫండ్ జనరేట్ సిస్టం ద్వారా జీతాలు ఇస్తే ఎవరికి ఇబ్బంది రాదు. ఉన్నతాధికారులు ఆలోచించి సమస్య పరిష్కరించాలి.
–కొండమడుగు రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

‘స్పర్శ్’లో సమస్యలు.. ఉద్యోగుల వెతలు