
జీపీఓలు వస్తున్నారు..
సాక్షి, యాదాద్రి: క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి నియమించిన గ్రామ పాలనాధికారులు(జీపీఓ) పల్లెలకు రానున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాకు చెందిన 148 మందికి నియామకపత్రాలు అందజేశారు. వీరికి శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. వీరంతా సోమవారం తమకు కేటాయించిన క్లస్టర్లలో విధుల్లో చేరనున్నారు.
భూ భారతి చట్టం
పటిష్టంగా అమలుకు..
రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం తీసుకువచ్చింది. చట్టాన్ని గ్రామ స్థాయిలో పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామ పాలనాధికారుల వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి గ్రామానికి జీపీఓను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం పూర్వపు వీఆర్ఓలు, వీఆర్ఏలకు అవకాశం కల్పించింది. అందుకు ఇష్టమైన వారు ఆప్షన్ పెట్టుకోవాలని సూచించింది. వారికి రెండు దఫాల్లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైనవారిని జీపీఓలుగా నియమించింది.
సొంత నియోజకవర్గంలో నో చాన్స్
గ్రామ పాలనాధికారులుగా నియమితులైన వారికి సొంత నియోజకవర్గంలో కాకుండా పొరుగు నియోజకవర్గంలో పోస్టింగ్ ఇచ్చారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్లో తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో యాదాద్రి జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలతో పాటు నాగార్జునసాగర్, నల్లగొండ, మేడ్చల్ మల్కాజిగిరి జల్లాలకు చెందిన వారు ఉన్నారు. తమ స్థానికతకు సంబంధించిన వివరాలను 143 మంది సమర్పించగా.. ఇంకా ఐదుగురు గ్రామ పాలనధికారులు సమర్పించ లేదు.
మెరిట్ ప్రకారంగానే కౌన్సెలింగ్
జిల్లాకు కేటాయించిన జీపీఓలకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ పూర్తి చేశారు. స్థానికత వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. సోమవారం తమకు కేటాయించిన క్లస్టర్లలో విధుల్లో చేరాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు మాలి కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, ఉద్యోగ సంఘాల నాయకులు మందడి ఉపేందర్రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.
203 క్లస్టర్ల ఏర్పాటు
జిల్లాలో 318 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గ్రామ పాలనాధికారులు సరిపోను లేనందున ప్రస్తుతం 203 రెవెన్యూ క్లస్టర్లుగా వాటిని ఏర్పాటు చేశారు. 148 మంది రాత పరీక్ష ద్వారా జీపీఓలుగా నియామకం అయ్యారు. వీరికి తోడుగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను జీపీఓలుగా నియమిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాలనాధికారిని నియమిస్తున్నారు. కాబట్టి ఖాళీగా ఉన్న జీపీఓ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహిస్తారు.
నియోజకవర్గం జీపీఓలు పోస్టులు
ఆలేరు 52 59
భువనగిరి 52 45
మునుగోడు 19 22
తుంగతుర్తి 11 12
నకిరేకల్ 06 10
నల్లగొండ 01 00
నాగార్జునసాగర్ 01 00
మేడ్చల్ 01 00
వివరాలు
సమర్పించని వారు 05 00
మొత్తం 148 148
కేటాయించిన జీపీఓలు
148 మంది గ్రామ పాలనాధికారులకు కౌన్సెలింగ్
మెరిట్ ఆధారంగా క్లస్టర్ల కేటాయింపు
ప్రోసీడింగ్ ఆర్డర్స్ అందజేత
8వ తేదీన విధుల్లో చేరిక