
నృసింహుడికి సౌర వెలుగులు!
యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆలయానికి విద్యుత్ అవసరాలను గ్రీన్ ఎనర్జీ ద్వారా తీర్చాలని యోచిస్తున్న దేవస్థానం.. ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించింది. మల్లాపురం రోడ్డులో గోశాల వద్ద దేవస్థానం భూముల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఈఓ వెంకట్రావ్ రెండు రోజుల క్రితం విద్యుత్ శాఖ, ఆలయ అధికారులతోనూ చర్చించారు.త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
మల్లాపురం రోడ్డులో సోలార్ప్లాంట్, గ్రిడ్!
మల్లాపురం మార్గంలో ఉన్న గోశాలలో లేదా, సమీపంలోని వైటీడీఏ భూమిలో గ్రీన్ ఎనర్జీ తయారీకి ఉపయోగించే సోలార్ పలకలు, ఉత్పత్తి అయిన విద్యుత్ను అనుసంధానం చేయడానికి గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. ప్రధాన క్షేత్రంలో పాటు కొండ దిగువన ఆలయానికి చెందిన తులసీ కాటేజీ, పాతగుట్ట క్షేత్రానికి విద్యుత్ సరఫరా చేయనున్నారని సమాచారం. మిగులు విద్యుత్ను బ్యాటరీల్లో నిలువ చేయనున్నారు.
ప్రస్తుతం ఇక్కడినుంచి కరెంట్ సరఫరా
ప్రస్తుతం ప్రధానాలయంతో పాటు తులసీకాటేజీ, పాతగుట్ట ఆలయానికి రెండు సబ్స్టేషన్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. మల్లాపురం రోడ్డులోని వైటీడీఏ స్థలంలో ఏర్పాటు చేసిన 132 కేవీ సబ్స్టేషన్, వికలాంగుల కాలనీ సమీపంలో 33 కేవీ సబ్స్టేషన్ ద్వారా విద్యుత్ అందుతుంది. వికలాంగుల కాలనీ సమీపంలోని 33కేవీ సబ్ స్టేషన్కు ఆలేరు మండలం కొలనుపాక సబ్స్టేషన్, యాదగిరిగుట్టలోని పాతగుండ్లపల్లి సబ్స్టేషన్ సప్లై వస్తుంది.
ప్రయోజనాలు ఇవీ..
సౌరవిద్యుత్తో అనేక ప్రయోజనాలున్నాయి. ఆల యానికి ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మిగులు విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఆలయంపై ఆర్థిక భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. తిరుమల తిరుపతిలో దేవస్థానం అవసరాలకు విండోపవర్, సౌరవిద్యుత్ను సొంతంగా తయారు చేసి వినియోగిస్తున్నారు. అదే తరహాలో యాదగిరి క్షేత్రంలో సైతం సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకువస్తే భవిష్యత్లో ఇబ్బందులు,ఖర్చులు ఉండవనే భావనలో ఆలయ అధికారులు ఉన్నారు.
పొదుపుమార్గంలో యాదగిరి క్షేత్రం.. గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ అవసరాలు తీర్చుకోవాలని నిర్ణయం
ఈ ఏడాదే ప్రారంభించేందుకు ప్లాన్
ఆలయ విద్యుత్ అవసరాలకు ప్రతి సంవత్సరం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వ రకు ఖర్చు చేస్తున్నాం. అయినప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ సమస్యలతో పాటు ఆర్థిక భారాన్ని అధిగమించాలన్న ఉద్దేశంతో గ్రీన్ ఎనర్జీని తీసుకువచ్చేందుకు ఆలోచిస్తున్నాం. నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంతో సోలార్ప్లాంట్, గ్రిడ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మిగులు విద్యుత్ నిలువ చేయడానికి సైతం నాలుగు మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనర్జీ బ్యాటరీలను ఏర్పాటు చేస్తాం. దీని వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన 10 సెకన్లలోనే తిరిగి పవర్ రీస్టోర్ అవుతుంది. దీనిపై ఇప్పటికే సంప్రదాయ ఇందన వనరుల శాఖను సంప్రదించాం. రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేశాం. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం. –వెంకట్రావ్,
యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ
మల్లాపురం రోడ్డులో సోలార్ ప్లాంట్, గ్రిడ్ ఏర్పాటు..
రూ.20 కోట్లు ఖర్చు
అవుతుందని అంచనా
త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ప్రస్తుతం ఏడాదికి రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల విద్యుత్ భారం
వ్యయం తగ్గించుకునేందుకు
సౌరశక్తిపై దేవస్థానం దృష్టి
ప్రతి నెలా 4 లక్షల యూనిట్లు, రూ.28 లక్షల వరకు బిల్లు
ప్రధానాలయంతో పాటు వివిధ విభాగాల అవసరాలకు ప్రస్తుతం ప్రతి నెలా 4 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇందుకు రూ.25 లక్షల నుంచి రూ.28లక్షల వరకు బిల్లు వస్తుంది. ఈ లెక్కన సంవత్సరానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు విద్యుత్ భారం పడుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఏటేటా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వాడకం కూడా అధికమవుతోంది. భారం తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో విద్యుత్ అవసరాలను సౌరశక్తి ద్వారా తీర్చుకోవాలని దేవస్థానం భావిస్తోంది. ఇందుకోసం రూ.20 కోట్ల వ్యయంతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్, 4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ప్రతి నెలా రూ.3లక్షల వరకు వస్తుంది. ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా ఆదా కానున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

నృసింహుడికి సౌర వెలుగులు!