
రెండేళ్లుగా పైసా ఖర్చు చేయలే!
ఖజానాలో మూలుగుతున్న రూ.15 కోట్లు
త్వరగా అభివృద్ధి పనులు చేపట్టాలి
నిధులు ఉన్నందున అవసరమైన వార్డుల్లో డ్రెయినేజీ, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలి. ఇందుకు మున్సిపల్ కమిషనర్ వెంటనే చొరవ చూపాలి.
– సముద్రాల శ్రీనివాస్, బీజేపీ నేత, ఆలేరు
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
వార్డుల్లో అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే రూ.15కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే పనులకు త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తాం.
– శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఆలేరు
ఫ టీయూఎఫ్ఐడీసీ కింద మంజూరు
ఫ పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం
ఫ వార్డుల్లో పడకేసిన అభివృద్ధి పనులు
ఫ ఇబ్బందుల్లో పట్టణ వాసులు
ఆలేరు: తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) నుంచి మంజూరైన కోట్ల రూపాయల నిధులు రెండేళ్లుగా ఆలేరు మున్సిపల్ ఖజానాలో మూలుగుతున్నా అభివృద్ధి పనులకు పైసా ఖర్చు చేయడం లేదు. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకమండలి పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. అధికారుల ఉదాసీన వైఖరితో ఆలేరు మున్సిపాలిటీలో అభివృద్ధి పడకేసింది. అధికారులు కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టిసారిస్తూ అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓపెన్ నాలాలతో పరేషాన్
మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉండగా, 22వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో ఓపెన్ నాలాల పరిస్థితి మెరుగుపడడం లేదు. అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు మోక్షం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వానాకాలంలో ఓపెన్ నాలాలతో మురుగునీటి సమస్య వల్ల దోమలు, పందులతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పలు ప్రాంతాల్లో సమస్యలు ఇలా..
వరదనీటి ప్రవాహం సులువుగా వెళ్లేందుకు పాత పంచాయతీ కార్యాలయ సమీపం నుంచి ప్రధాన రోడ్డులోని మసీదు వరకు స్ట్రామ్ నిర్మించాల్సి ఉంది. మున్సిపల్ ఆఫీస్కు కూతవేటు దూరంలో, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ పక్కన డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలి. ఇక్కడ మురుగునీరు ఏరులై పారుతూనే ఉంది. క్రాంతి నగర్, రైల్వేస్టేషన్ మార్గంలో డబుల్ బెడ్ ఇళ్ల వద్ద తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వలు నిర్మించాలని చాలాకాలం నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సీసీ రోడ్లు కూడా కావాలని పలు వార్డుల ప్రజలు కోరుతున్నారు. ఇటీవల బీసీ కాలనీ వాసులు కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసిన అభివృద్ధి పనులను చేపట్టడం లేదని స్థానికులు అంటున్నారు.
అంతర్గత రోడ్లు అధ్వానం
పోచమ్మ గుడి సమీపంలోని శాంతినగర్లో అంతర్గత రోడ్డు అధ్వానంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. దాదాపు పదేళ్లుగా ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒక్క శాంతినగర్లోనే కాదు పలు వార్డుల్లోని అంతర్గత రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందనే విమర్శలు ఉన్నాయి.
రూ.15 కోట్లతో పనులు ఇలా..
టీయూఎఫ్ఐడీసీ కింద దాదాపు రెండేళ్ల క్రితం ఆలేరు మున్సిపాలిటీకి రూ.15కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో రూ.9కోట్లతో వివిధ వార్డులు, ప్రధాన మార్గాల్లో స్ట్రామ్ల నిర్మాణం చేపట్టాలి. వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. గ్రామ పంచాతీయ కార్యాలయం ఆవరణలో కొత్త మున్సిపల్ భవనం నిర్మాణానికి రూ.3కోట్లను కేటాయించారు. మిగితా రూ.3కోట్లతో ఇతర మౌలిక సదుపాయాలకు వెచ్చించాల్సి ఉంది. కానీ ఇంత వరకు పనుల అతీగతి లేకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

రెండేళ్లుగా పైసా ఖర్చు చేయలే!

రెండేళ్లుగా పైసా ఖర్చు చేయలే!