
కడుపులోనే.. కాటికి!
సాక్షి యాదాద్రి : చట్టరీత్యా నేరమని తెలిసినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్నాయి. పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్డా అని స్కానింగ్ ద్వారా ముందే చెప్పేస్తున్నాయి. ఆడపిల్లయితే గర్భంలోనే ఊపిరి తీస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేయడం ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో బట్టబయలైంది. జిల్లాలో లింగ నిర్ధారణకు సంబంధించి గతంలోనూ అనేక కేసులు వెలుగుచూశాయి.
సీజ్ చేసినా మరో పేరుతో ఓపెన్
జిల్లాలో పలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కనీస వైద్య అర్హత లేకుండా నిర్వహిస్తున్నారు. గతంలో తుర్కపల్లి మండలం మాదాపూర్లో, చౌటుప్పల్ పట్టణంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి అబార్షన్ చేసినట్లు బట్టబయలు కావడంతో ఆస్పత్రులను సీజ్ చేసి ర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే సదరు వ్యక్తులు మరో పేరుతో ఆస్పత్రులు తెరిచి అమానవీయ దందా నిర్వహిస్తున్నారు. భువనగిరితో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో అవసరమైన చోటకు స్కానింగ్ మిషన్లు తీసుకువెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్..
జిల్లాలో మెటర్నిటీ నర్సింగ్ హోంలు, స్కానింగ్ సెంటర్లు 41 ఉన్నాయి. ఇందులో స్కానింగ్ పరీక్షలు చేయడానికి 14 నర్సింగ్హోంలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ, ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు పుట్టుగొడుగల్లా పుట్టుకొస్తున్నాయి. జిల్లా వైద్యాధికారి మారినప్పుడల్లా తనిఖీల పేరిట హడావుడి చేయడం.. ఆ తర్వాత మౌనంగా ఉండటం పరపాటిగా మారుతుంది. మూడు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్ల్లో తనిఖీలు నిర్వహించగా అక్రమాలు వెలుగుచూశాయి. కానీ, ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చి అబార్షన్లు చేయించుకొని పోతున్నట్లు తెలుస్తోంది. అయినా వైద్యారోగ్య శాఖ అధికారుల్లో చలనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న బ్రూణ హత్యలు
ఫ ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే పిండం తొలగింపు
ఫ కాసుల కక్కుర్తితో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు
ఫ తనిఖీల్లో వెలుగుచూస్తున్నా కఠిన చర్యలు తీసుకోని వైద్యారోగ్య శాఖ అధికారులు
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
భ్రూణహత్యలు వెలుగుచూడటం బాధాకరం. ఇప్పటికే జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గుతుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యావంతులు, సమాజానికి సేవలందించేవారు కూడా ఆడిపిల్లలపై వివక్ష చూపుతుండటం బాధాకరం. లింగనిర్ధారణ ద్వారా అబార్షన్లు చేయించినా, చేసినా కఠిన చర్యలు తప్పవు. –బండారు జయశ్రీ,
మహిళా, శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్

కడుపులోనే.. కాటికి!