
పాఠశాలను సందర్శించిన జడ్జి
బొమ్మలరామారం : మండలంలోని మల్యాల గ్రామ పరిధిలో గల ఆశీర్ మిషన్ స్కూల్ను బుధవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవీలత సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం తుర్కపల్లి మండలం మాధాపూర్లోని ఆదరణ బాల సంరక్షణ భవన్ను జడ్జి సందర్శించారు. బాలలతో ముఖాముఖి మాట్లాడారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.అనంతరం మల్కాపూర్లో ఇటుక బట్టీలను సందర్శించారు. బట్టీలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి తుర్కపల్లి ఎస్హెచ్ఓకు సమాచారం అందించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ హెయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగరాజు తుర్కపల్లి ఏఏఎస్ఐ బాల్ నర్సింహ పాల్గొన్నారు.
గుట్ట శివాలయంలోసంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతసేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకారమండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, ముఖ మండపంలో జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
అందుబాటులో సరిపడా ఎరువులు
భువనగిరి : రైతుల అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను ఎరువుల దుకాణంలో అందజేయాలని, విస్తీర్ణణాన్ని బట్టి ఎరువులు ఇస్తారని పేర్కొన్నారు. వానాకాలం సీజన్కు కావాల్సిన ఎరువులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామన్నారు.
భువనగిరి రూరల్కు ఇద్దరు కొత్త ఎస్ఐలు
భువనగిరి : భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్కు కొత్తగా ఇద్దరు ఎస్ఐలు రానున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాచకొండ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సెప్టెంబర్ 25 నుంచి 2025 జూన్ 30వ తేదీ వరకు శిక్షణ పొందిన కొత్త ఎస్ఐలను పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఇందులో భాగంగా భువనగిరి రూరల్కు ఓరుగంటి సంధ్య, కట్ట శివశంకర్రెడ్డి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బియ్యం ఎగుమతుల్లో వేగం పెంచండి
రామన్నపేట : గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి బియ్యం ఎగుమతులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో రామన్నపేట, వలిగొండ మండలాల పరిధిలోని మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీలైనంత త్వరగా సీఎంఆర్ బకాయిలు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ లాల్బహదూర్శాస్త్రి, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, సీనియర్ అసిస్టెంట్ గాలయ్య ఆర్ఐలు శోభ, రాజేశ్వర్ పాల్గొన్నారు.

పాఠశాలను సందర్శించిన జడ్జి