
ఐదేళ్లుగా ఎదురుచూపుల్లోనే!
చౌక్లతండా, కోక్యాతండా, పీర్యాతండా నిర్వాసితులకు అందని పరిహారం
తుర్కపల్లి: బస్తాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న తుర్కపల్లి మండలంలోని నిర్వాసితులకు భూ పరిహారం, పునర్ నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ కోసం ఎదురుచూపులే మిగిలాయి. ఐదేళ్ల క్రితం 29 ఎకరాలకు పరిహారం చెల్లించగా.. మిగతా భూమికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రస్తావనే లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయామే తప్పా.. పరిహారం మాత్రం రాలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
241 ఎకరాల భూ సేకరణ
రిజర్వాయర్ కోసం చోక్లాతండా, కోక్యాతండా పూర్తిగా, పీర్యాతండా పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. బాధిత తండాల్లో అధికారులు సర్వే నిర్వహించి 83 కుటుంబాలు నష్టపోతున్నాయని, ఆయా కుటుంబాల్లో 234 మంది ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వ్యవసాయ భూముల్లోని బోర్లు, చెట్లు, ఫలవృక్షాలు, ప్లాట్లు, ఖాళీ స్థలాలకు ప్రత్యేక పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి రూ.7.61లక్షల చొప్పున అందుతుంది. కానీ, ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏడేళ్లు కావస్తున్నా నేటికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రస్తావనే లేదు. పునరావాస గ్రామ నిర్మాణం కోసం దాతరుపల్లిలో స్థలాన్ని కేటాయించారు. అంతేకాకుండా ఆయా తండాల పరిధిలో 2020 సంవత్సరంలో 241 ఎకరాల భూ సేకరణ చేశారు. అందులో కేవలం 29 ఎకరాలకు మాత్రమే ఐదేళ్ల క్రితం పరిహారం చెల్లించారు. ఎకరానికి కనిష్టంగా రూ.18 లక్షలు, గరిష్టంగా రూ.21.60 లక్షలు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా భూముల రైతులు పరిహారం కోసం ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారు.
ఫ 241 ఎకరాలకు 29 ఎకరాలకే పరిహారం చెల్లింపు
ఫ పునరావాస గ్రామ నిర్మాణానికి నేటికీ మొదలుకాని సన్నాహాలు
ముంపునకు గురవుతున్న గ్రామాలు ఇవీ..
11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న బస్వాపూర్(నృసింహసాగర్) రిజర్వాయర్లో భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపురం, తుర్కపల్లి మండలంలోని చోక్లాతండా, కోక్యాతండా పూర్తిగా, పీర్యాతండా పాక్షికంగా, యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్తండా ముంపునకు గురవుతున్నాయి. బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు విడుదల చేయగా వారి ఖాతాల్లో జమయ్యాయి. మిగతా గ్రామాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.