రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు | - | Sakshi
Sakshi News home page

రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు

Jun 6 2025 12:52 AM | Updated on Jun 6 2025 7:36 AM

రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు

రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు

యాదగిరిగుట్ట : ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం సుమారు రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురం గ్రామం వేదిక కానుంది.

● యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. టెంపుల్‌ సిటీలో 15 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం. దాతారుపల్లి రెవెన్యూ పరిధి లోని వైటీడీఏ స్థలంలో రూ.180కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే దాతారుపల్లిలో రూ.15కోట్లతో ఏర్పాటు చేసే వేర్‌ హౌజ్‌ గోదాములకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

● తుర్కపల్లి మండల పరిధిలోని గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు, రాంపూర్‌తండా సమీపంలో 15ఎకరాల స్థలంలో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన.

● ఆలేరు నియోజకవర్గంలో రూ.50 కోట్ల నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు, రూ.14.50 కోట్లతో ఆలేరు మండలం కొలనుపాక, రాజాపేట మండలం కాల్వపల్లి వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిలు, రూ.30 కోట్లతో సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ రోడ్లకు, మోటకొండూర్‌లో రూ.10కోట్లతో ఎంపీపీ, తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన్‌ భవనాలకు, ఆలేరులో రూ.15కోట్లతో నిర్మించే మార్కెట్‌ యార్డు గోదాములకు శంకుస్థాపన చేస్తారు.

సీఎం వెంట రానున్న ప్రముఖులు

సీఎం రేవంత్‌రెడ్డి వెంట శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దామోదరం రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement