
పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: పెట్రోల్ బంకులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నాగార్జునసాగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన అనాల శివ పెట్రోల్ బంకుల్లోకి వెళ్లి, తన బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని.. డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి తన ఏటీఎం కార్డుతో స్వైపింగ్ మిషన్ ద్వారా పెట్రోల్ బంకు అకౌంట్కు డబ్బులు పంపి నగదును తీసుకునేవాడు. ఈ తర్వాత స్వైపింగ్ కార్డు ద్వారా వైడ్ అనే ఆప్షన్తో తాను పంపిన డబ్బులను తిరిగి తన అకౌంట్కే పంపించుకునేవాడు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో మోసాలకు పాల్పడ్డాడు. ఈ నెల 16వ తేదీన నాగార్జునసాగర్లో హైవే పక్కన ఉన్న భారత్ పెట్రోల్ బంక్కు వెళ్లి తనకు డబ్బులు అవసరం ఉన్నాయని స్వైపింగ్ చేసి డబ్బులు తీసుకుని తిరిగి స్వైపింగ్ ద్వారా వైడ్ అనే ఆప్షన్తో తన అకౌంట్కు డబ్బులు పంపించుకున్నాడు. ఈ మోసాన్ని గుర్తించిన బంకు యజమాని బొమ్మిడి బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ బి. శ్రీనునాయక్ గురువారం నాగార్జునసాగర్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన అనాల శివ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందుతుడి నుంచి రూ.2లక్షల నగదు, బైక్,, 6 ఏటీఎం కార్డులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాగార్జునసాగర్ సీఐ బి. శ్రీనునాయక్, ఎస్ఐ ఎస్. సంపత్, కానిస్టేబుళ్లు రామకోటి, జావేద్, సురేష్, సతీష్, వెంకన్న, సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.2లక్షల నగదు, బైక్,
6 ఏటీఎం కార్డులు స్వాధీనం