
మానవ అక్రమ రవాణాను అరికడదాం
● డీఈఓ సత్యనారాయణ
భువనగిరి : మానవ అక్రమ రవాణాను నిరోధించడం అందరి బాధ్యత అని డీఈఓ సత్యనారాయణ అన్నారు. మానవ అక్రమ రవాణాపై బుధవారం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లాలోని కేజీబీవీ, మోడల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 2,920 మంది యువతులను అక్రమ రవాణా నుంచి కాపాడినట్లు చెప్పారు. ప్రమాదకర సమయాల్లో 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ శ్రీనివాస్ చారి, జాయింట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మంజరి, కోర్సు కో ఆర్డినేటర్ యేమియా, ప్రజ్వల ఎస్పీఎం చంద్రయ్య, ఎన్జీఓ కో ఆర్డినేటర్ శ్రావ్య శృతి, చెన్న కేశవులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.