
కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలి
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హాటల్లో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ పాలనను తలపించే విధంగా సీఎం రేవంతర్రెడ్డి పాలన కనిపిస్తుందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. పార్టీ నిర్మాణంలో క్షేత్ర స్థాయి నుంచి సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు అగ్రనాయకత్వం రూట్ మ్యాప్ను ఖరారు చేసిందని తెలిపారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలకపాత్ర వహిస్తాయన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. కాగా.. పార్టీ మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు మాత్రమే మాట్లాడుతున్నారని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని పలువురు కార్యాకర్తలు ఆందోళన చేశారు. వారిని సముదాయించడంతో సద్దిమణిగింది. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్లు ధనవంతి, డాక్టర్ పులి అనిల్, టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి