పోచంపల్లిలోనే ఐఐహెచ్‌టీ | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లిలోనే ఐఐహెచ్‌టీ

May 3 2025 12:18 AM | Updated on May 3 2025 12:18 AM

పోచంప

పోచంపల్లిలోనే ఐఐహెచ్‌టీ

భూదాన్‌పోచంపల్లి : చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి కేంద్రీకృతంగానే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్‌ చేనేత సదస్సులో ఆయన మాట్లాడారు. రైతన్నలు, నేతన్నలు తమకు రెండు కళ్లని, వారి కష్టం, త్యాగాల వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఉన్నతాధికారుల నుంచి నివేదిక రాగానే చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. తన దృష్టికితీసుకొచ్చిన చేనేత సమస్యలను కేబినెట్‌లో పెట్టి, మరికొన్నింటిపై సీఎంను ఒప్పించి పరిష్కరించుటకు కృషిచేస్తానన్నారు. హ్యాండ్లూమ్‌ పార్కు లేదా స్వామిరామానందతీర్థ గ్రామీణసంస్థలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ఐఐహెచ్‌టీకి ఆచార్య కొండాలక్ష్మణ్‌బాపూజీ పేరు పెట్టాలని సీఎం నిర్ణయించారని వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఉన్న మండలాలతో పాటు భూదాన్‌పోచంపల్లి మండలానికి కూడా టెక్నికల్‌ సమస్యల వల్ల రైతుభరోసా ఆగిపోయిందని, వచ్చే రైతుభరోసాలో తప్పకుండా రైతులందరికీ ఖాతాలో డబ్బులు పడుతాయని, ఆందోళన చెందవద్దని కోరారు. అంతకుముందు కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేనేత సహకార సంఘాన్ని సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు.

చేనేత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా :

ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

చేనేత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తాను కేంద్రంలోని చేనేత, జౌళిశాఖ కన్సంటెంట్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని ఇటీవల పోచంపల్లి ఇక్కత్‌ డుప్లికేషన్‌పై పార్లమెంట్‌లో అడిగానని గుర్తు చేశారు. అదేమాదిరిగా కేంద్రం నుంచి రావల్సిన పథకాలు, నిధులు, పోచంపల్లిలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుపై ఈ నెల 6న జరిగే సమావేశంలో కేంద్రజౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌తో చర్చిస్తానని చెప్పారు.

నూలుడిపో ఏర్పాటు చేయాలి :

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

పోచంపల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలని, సహకార సంఘంతో పాటు సహకారేతర సంఘాల నుంచి కనీసం 25 శాతం చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని హ్యాండ్లూమ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, రాష్ట్ర చేనేత, జౌళిశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్లు వెంకటేశ్వర్‌రావు, ఇందుమతి, రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మ, ఏడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి, రాష్ట్ర చేనేత నాయకులు తడక వెంకటేశం, అర్భన్‌బ్యాంకు చైర్మన్‌ తడక రమేశ్‌, టై అండ్‌ డై అసోషియేషన్‌ అధ్యక్షుడు భారత లవకుమార్‌, చేనేత కార్మికసంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు కొట్టం కరుణాకర్‌రెడ్డి, రేఖాబాబురావు, పాక మల్లేశ్‌, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు.

ఫ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం

ఫ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

ఆర్‌డీ అకౌంట్‌లో డబ్బులు జమ చేయండి

ఫ చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

శైలజా రామయ్యర్‌,

చేనేత కార్మికులు త్రిఫ్ట్‌ పథకానికి సంబంధించి ఆర్‌డీ 1 అకౌంట్‌లో తమ వాటా ధనం జమచేసుకుంటే ప్రభుత్వం ఈ నెల 10నుంచి ఆర్‌డీ 2 అకౌంట్‌లో తన వాటా డబ్బులు జమచేస్తుందని చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ అన్నారు. చేనేత బీమా కింద చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఇప్పటివరకు రూ.5 కోట్లు చెల్లించామన్నారు. సహకార సంఘాల ద్వారా రూ. 15 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేశామని, ఇందులో యాదాద్రి జిల్లాలో రూ.4.50 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసి టెస్కో షోరూంల ద్వారా విక్రయిస్తున్నామని చెప్పారు. రెండు నెలల్లో రుణమాఫీ డబ్బులను కార్మికుల ఖాతాలో జమచేస్తామని, చేనేతవస్త్రాల డుప్లికేట్‌ నిరోధానికి తెలంగాణ లేబుల్‌ తీసుకొస్తున్నామని తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కులో మ్యూజియం, డిజైనింగ్‌, డైయింగ్‌, ఎగ్జిబిషన్‌ అన్ని ఒకేదగ్గర ఏర్పాటు చేసేలా డీపీఆర్‌ తయారు చేస్తున్నామని చెప్పారు.

పోచంపల్లిలోనే ఐఐహెచ్‌టీ 1
1/1

పోచంపల్లిలోనే ఐఐహెచ్‌టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement