
15న సుందరీమణుల రాక
సాక్షి,యాదాద్రి : వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 15న జిల్లా సందర్శనకు రానున్నారని, ఈ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ వేదికగా ఈనెల 7నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వస్తున్నారని, తమ పర్యటనలో భాగంగా యాదాద్రి జిల్లాను సందర్శిస్తారని వెల్లడించారు. 15వ తేదీన సాయంత్రం భూదాన్పోచంపల్లి రూరల్ టూరిజంపార్క్కు 30 మంది, యాదగిరిగుట్టకు 30 మంది వస్తారని పేర్కొన్నారు. పోచంపల్లిలో చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీని పరిశీలిస్తారని, యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దర్శనంతోపాటు కొండపైన ప్రత్యేక ప్రాంతాలను సందర్శిస్తారని చెప్పారు. అదేరోజు రాత్రి తిరిగి హైదారాబాద్ వెళ్తారని తెలిపారు. ప్రభుత్వ పా ఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయ ని, టెన్త్ ఫలితాలే నిదర్శనమన్నారు.
అట్రాసిటీ కేసులపై సమీక్ష
భువనగిరి టౌన్ : కలెక్టరేట్లో శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అధ్యక్షతన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసులపై ఎమ్మెల్యే సమీక్షించారు. పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ప్రతి నెలా అన్ని మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ఏసీపీలు, కమిటీ సభ్యులు సుదర్శన్, శివలింగం, నర్సింగరావు, తిరుమలేష్, రాజన్నాయక్ పాల్గొన్నారు.
గవర్నర్ను కలిసిన ఐలయ్య
యాదగిరిగుట్ట : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజభవన్లో కలిశారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఏప్రిల్ 8న గవర్నర్ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపడంతో గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందన్నారు.
8,162 ఇళ్లు మంజూరు
భువనగిరిటౌన్ : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 5నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 8,932 ఇందిరమ్మ ఇళ్లకు గాను ఇప్పటి వరకు 8,162 ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్సింగ్, డీఈలు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
బొమ్మలరామారం : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ హేమిమా తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయని, ఒక్కో గ్రూప్లో 40 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు
భువనగిరిటౌన్ : అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నెల 1నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేసేందుకు ఆ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరకులు సరఫరా చేయనున్నారు. జిల్లాలోని 901 అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 24 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇక అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు, ఆయాలకు 15 రోజుల చొప్పున సెలవులు ఉండనున్నాయి. మిగతా రోజుల్లో ఇంటింటి సర్వే, చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చడానికి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు, సిబ్బందికి ఉపశమనం కలిగినట్లయింది.