
సుందరీమణుల రాక కోసం..
భూదాన్పోచంపల్లి: హైదరాబాద్ వేదికగా ఈ నెల 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు పోచంపల్లితో పాటు నాగార్జునసాగర్ను సందర్శించనున్నారు. వారి రాక కోసం సాగర్లోని బుద్ధవనం, పోచంపల్లిలోని టూరిజం పార్కు తదిత పర్యాటక ప్రాంతాలను అధికారుల ప్రత్యేంగా ముస్తాబు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే 140 దేశాలకు చెందిన సుందరీమణులను బృందాలుగా విభజించి తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వారసత్వ ప్రదేశాలు, దేవాలయాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించే విధంగా అధికారులు రూట్మ్యాప్ తయారు చేశారు. అందులో భాగంగానే ఈ నెల 15న సుమారు 40దేశాలకు చెందిన అందాల భామల బృందం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా ఇక్కడి టూరిజం పార్కులోని ఇంటీయర్తో పాటు బయటి ప్రాంగణమంతా రంగులు వేస్తూ సుందరీకరణ చేస్తున్నారు. మ్యూజియం, హాప్లి థియేటర్, గెస్ట్ రూంలను అందంగా అలంకరిస్తున్నారు.
చేనేత సంస్కృతి ఉట్టిపడేలా..
పోచంపల్లికి వచ్చే అందాల భామలకు చేనేత థీమ్ ప్రతిబించేలా అధికారులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. పది రోజుల క్రితం అప్పటి పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించి అధికారులకు, ఈవెంట్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అందుకనుగుణంగా చేనేత మ్యూజియంలోని గోడలకు పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల వస్త్రాలతో అలంకరించనున్నారు. అంతేకాక టూరిజం ప్రాంగణంలో ఆయా చేనేత వస్త్రాల తయారీ విధానాలను లైవ్ డెమాన్స్ట్రేషన్తో పాటు చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక మహిళలచే అందాల భామలకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాంప్లి థియేటర్ వద్ద నిర్వహించే చేనేత కార్మికుల ముఖాముఖి కార్యక్రమంలో కనీసం మూడు వందల మంది స్థానికులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే స్థానిక యువతులచే చేనేత ఇక్కత్ వస్త్రాలను ధరించి ర్యాంప్వాక్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు గంటల పాటు ప్రోగ్రాం..
15వ తేదీ ఉదయం యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం సుందరీమణులు సాయంత్రం పోచంపల్లికి వస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇక్కడ సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. వారం క్రితం టూరిజం అధికారులు యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి రూట్లలో టూరిజం బస్సులను నడిపి రోడ్డు మార్గం ఎలా ఉందని ట్రయల్ రన్ నిర్వహించారు.
ముస్తాబవుతున్న సాగర్లోని బుద్ధవనం, పోచంపల్లిలోని టూరిజం పార్కు
చేనేత థీమ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
సుందరంగా బుద్ధవనం
నాగార్జునసాగర్: మరో అందాల భామల బృందం ఈ నెల 12న బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని నాగార్జునసాగర్ను సందర్శించనున్నారు. ఇందు కోసం గత నెల రోజులుగా సాగర్ తీరాన గల విజయవిహార్ అతిథి గృహం, బుద్దవనంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధవనంలో పచ్చదనంతో కూడిన ప్రకృతి అందాలు ఇనుమడింపజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుద్ధవనం ప్రవేశ ద్వారం నుంచి మహాస్థూపం వరకు విద్యుత్ వెలుగులతో చూపరులను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. తపోవనం, స్థూపవనం, జాతక మార్పు తదితర ప్రదేశాలను అన్నింటిని పరిశుభ్రం చేశారు. విదేశీయులు కాసేపు సేదతీరేలా విజయవిహార్ను ఆధునీకరిస్తున్నారు. ఏర్పాట్లను చూసేందుకు వారానికి ఓమారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం ఐజీ, జిల్లా ఎస్పీతో కలిసి సాగర్ను సందర్శించారు.

సుందరీమణుల రాక కోసం..

సుందరీమణుల రాక కోసం..