
ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్
నల్లగొండ, గుర్రంపోడు: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాల్వ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.442 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పరిపాలనా అనుమతులు సైతం ఇస్తూ బుధవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 23.500 కిలోమీటర్ల నుంచి మూసీ వరకు గల 136.150 కిలోమీటర్ల లైనింగ్కు 113 కిలోమీటర్ల మేర కాల్వ సిమెంట్ కాంక్రీట్ చేయనున్నారు. ఇటీవలే అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేస్తూ తాజాగా పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే నేరుగా కృష్ణాజలాలు అందే 23వ కిలోమీటర్ కామన్ పాయింట్ నుంచి ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్ పనులు మొదలవుతాయి. బిడ్లుగా విభజించి త్వరలో టెండర్లు పిలువనున్నారు. కాల్వకు నీటి విడుదల జరగని జూలైలోగా కాల్వ సీసీ లైనింగ్ పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఎట్టకేలకు సీసీ లైనింగ్ ..
1984లో తవ్విన ప్రధాన కాల్వకు దశాబ్దాలు గడిచినా కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో కాల్వగట్టు శిథిలమై నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయింది. 3వేల క్యూసెక్కుల సామర్థ్యం గల ప్రధాన కాల్వలో 1,200 క్యూసెక్కుల నీటి ప్రవాహ కొనసాగుతుండగా మధ్యలోనే లీకేజీలతో చివరకు నీరు చేరే సరికి సగానికి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంటనే లైనింగ్ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు లైనింగ్ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లైనింగ్ పూర్తయితే 3వేల క్యూసెక్కుల నీటితో 1.5 టీఎంసీల నీటి సామర్థ్యం పానగల్ రిజర్వాయర్ను నిండడానికి పది, పదిహేను రోజులే పట్టనుంది. ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ వల్ల సుమారు 2.20లక్షల ఎకరాల్లోని ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు కూడా సాగు నీరందుతుందని అధికారులు భావిస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ పాలనా ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను సీఎం అనుముల రేవంత్రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రూ.442 కోట్ల నిధులతో
పరిపాలనా అనుమతులు
ఉత్తర్వులు జారీ చేసిన
నీటిపారుదల శాఖ
త్వరలోనే టెండర్లకు ఆహ్వానం
సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు
తెలిపిన మంత్రి కోమటిరెడ్డి