
ఏడాదిన్నరగా ఎదురుచూపులు
త్వరలో నోటిఫికేషన్ జారీ
ఉమ్మడి జిల్లాలో ఆలయాల్లో పాలకవర్గాల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుంది. గతంలో 83 వరకు ఆలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశాం. అందులో 40 వరకు ఆలయాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు చేసుకోని ఆలయాలకు మళ్లీ నోటిఫికేషన్ ద్వారా పాలకవర్గాలు ఏర్పాటు జరుగుతుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. – కె. భాస్కర్,
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
ఫ ఉమ్మడి జిల్లాలోని పలు
ఆలయాలకు పాలకవర్గాలు లేక
కుంటుపడుతున్న అభివృద్ధి
ఫ ప్రముఖ ఆలయాల్లో ఈఓలు,
సిబ్బందితో కష్టతరంగా నిర్వహణ
రామగిరి(నల్లగొండ): ఉమ్మడి జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాలకు ఏడాదిన్నరగా పాలకవర్గాలు లేక ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కుంటుపడుతోంది. ఏటా వివిధ మాసాల్లో నిర్వహించే ఉత్సవాల్లో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ఈఓలు, సిబ్బందితో దేవాలయాలను నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఒక్కో ఈఓ మూడు, నాలుగు దేవాలయాలకు ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పూర్తిగా ఒకే ఆలయంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. పండుగలు, విశేష రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు సరైన సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయాల్లో భక్తులు వేసిన కానుకలు, హుండీ ఆదాయంపై ఉన్న శ్రద్ధ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై దేవాదాయ శాఖ దృష్టి సారించకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. ఏడాదిన్నర క్రితం గత ప్రభుత్వ పాలనలో ఆలయాల పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ట్రస్ట్ బోర్డు ఏర్పాటవుతుందని ఎదురుచూశారు. ఇంతలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల అనంతరం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు నోటిఫికేషన్ రావడంలో జాప్యమైంది. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దేవాలయాల్లో పాలకవర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధిత అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి చొరవ తీసుకుని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 83 ఆలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 40 ఆలయాల నుంచి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మిగతా ఆలయాల నుంచి దరఖాస్తులు రాలేదు. చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి, మఠంపల్లి మండలం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తుమ్మడం కోటమైసమ్మ దేవాలయం, నల్లగొండ రామగిరి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాలకు పాలకవర్గం లేకపోవడంతో ఆలయాల నిర్వహణ కష్టతరంగా మారింది. ఆలయాల్లో ఉత్సవాల సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు మొదలు పూజాధికార్యాలకు ఇబ్బందులు పడుతున్నారు. పాలకవర్గం ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయించే అవకాశం ఉంటుంది.

ఏడాదిన్నరగా ఎదురుచూపులు