నూజివీడు: టీడీపీ ప్రభుత్వం వచ్చిందే మట్టి దోపిడీకి అన్నట్లుగా గ్రామాల్లో పరిస్థితులు తయారయ్యాయి. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతో విలువైన మట్టి తరలించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకొంటున్నారు. మండలంలోని దేవరగుంటలోని కోతులగుంట చెరువులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. చెరువులో నుంచి మట్టిని కిలోమీటరు దూరం ఉన్న గ్రామంలోకి తోలడానికి రూ.800, దేవరగుంట నుంచి వేంపాడు వద్దకు తోలేందుకు ట్రక్కుకు రూ.1400 చొప్పున వసూలు చేస్తున్నారు. గ్రామంలోకి కిరాయితో కలుపుకుని ట్రక్కు రూ.450కు తోలవచ్చని కానీ ఇక్కడ రూ.800లు వసూలు చేస్తూ దోచుకుంటున్నారని, ఈ దోపిడీని ఆపే అధికారులే లేకపోవడం దారుణమైన పరిస్థితులకు అద్దం పడుతోందని పలువురు గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అక్రమంగా మట్టిని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నా వీఆర్ఓ గానీ, తహసీల్దార్ గానీ, ఇరిగేషన్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనర్హం. కొన్ని చెరువుల్లో అయితే తూము లెవెల్ కంటే ఇంకా లోతుకు తవ్వి మట్టిని తరలిస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా తవ్వడం వల్ల అరకొరగా చెరువుకు నీళ్లు వచ్చినా తూము నుంచి బయటకు రావని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరతున్నారు.


