కొయ్యలగూడెం: ట్రేడింగ్ కంపెనీలతో చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని వర్జీనియా పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా పొగాకు బోర్డు కృషి చేస్తుందని బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఆక్షన్ మేనేజర్ కె.రామాంజనేయులుతో కలసి కొయ్యలగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. వేలం విధానాలను, రేటు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వేలం అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరాసరి ధర రూ.300 ఉండేలా చూడాలని పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర తేలిక నేలలు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, కొయ్యలగూడెం వేలం నిర్వహణ అధికారి శివకుమార్, ఎఫ్ఓ దీపక్ తదితరులు పాల్గొన్నారు.


