ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలికల బాస్కెట్బాల్ క్రీడకు చిరునామాగా మారిందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాల ఆవరణలో ఉమ్మడి జిల్లా యూత్ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. తాడేపల్లిగూడెం, తణుకు, మార్టేరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు ఈ పోటీల్లో తలపడ్డారు. మొదట నిర్వాహకులు రన్నింగ్ షాట్స్ ప్రాక్టీస్ చేపట్టారు. అనంతరం వివిద ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారిణులను జట్లుగా విభజించి మ్యాచ్లు నిర్వహించారు. ఈ మ్యాచ్లో ప్రతిభ చాటిన వారి పేర్లును జిల్లా జట్లకు ప్రకటించారు. జులై 9 నుంచి 12 వరకు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల కోసం జట్టును ఎంపిక చేసినట్లు కోశాధికారి కె.మురళీకృష్ణ తెలిపారు. జట్టు సభ్యులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలన్నారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారిణులు పోటీలకు హాజరుకాకపోతే వారి స్థానంలో స్టాండ్బైగా ఎంపికై న వారిని పోటీలకు పంపిస్తామన్నారు.
జట్టు సభ్యులు వీరే..
ఎంపికై న జట్టులో పి.నందిని, పి.ఎస్.సులోచన, ఎస్.సాత్విక, జి.సంజన, టి.ఉదయలక్ష్మి, ఎం.హేమశ్రీ, డి.సాయిశ్రీలాస్య, ఎస్.పి.కుషి, ఎల్.దేవి వెంకట సహస్ర, ఎస్.కె.లాతిఫా, టి.కె.రుచిక, ఏ.మేరీగ్రేసీ ఉన్నారు. వీరితో పాటు స్టాండ్బైగా ఎం.నమృత, ఎస్.వైష్ణవితో పాటు టి.శ్రావణి ఎంపికయ్యారని నిర్వాహకులు వెల్లడించారు. పోటీలను పాఠశాల వ్యాయామ ఉపాధ్యయులు మాధవి, గోపీ పర్యవేక్షించారు.


