భీమడోలు: ఆర్టీసీ బస్సులో టికెట్ చెల్లింపు విషయంలో తలెత్తిన వివాదం చివరికి డ్రైవర్పై దాడికి దారి తీసింది. ఈ ఘటన ఆదివారం జాతీయ రహదారి పూళ్ల వద్ద చోటు చేసుకుంది. తణుకు డిపోకు చెందిన అల్టా పల్లె వెలుగు ప్రైవేటు బస్ ఏలూరు నుంచి తణుకు వెళ్లేందుకు బయలు దేరింది. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంకు చెందిన గన్నేపల్లి కృష్ణప్రసాద్ బస్సు నడుపుతున్నాడు. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కగా మహిళా కండక్టర్ టికెట్ తీసుకోవాలని కోరింది. క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లిస్తారని చెప్పగా, నెట్వర్క్ సరిగా పని చేయడం లేదని, నగదు ఇవ్వాలని సృష్టం చేసింది. దీంతో ప్రయాణికుడు వాగ్వావాదానికి దిగాడు. డ్రైవర్ కల్పించుకుని ప్రయాణికుడిని మందలించాడు. అనంతరం ప్రయాణికుడు బస్సు నుంచి దిగిపోయాడు. ఆ బస్సు అక్కడ నుంచి బయలుదేరి తణుకు వైపుగా వెళ్తూ పూళ్ల వద్దకు చేరుకుంది. ఇంతలో ప్రయాణికుడు మరో ఇద్దరితో బైక్లపై వచ్చి బస్ డ్రైవర్ను కొట్టారు. దీంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఆ తర్వాత డ్రైవర్, కండక్టర్లు బస్సులోని ప్రయాణికులను దింపి మరో ఆర్టీసీ బస్సులో ఎక్కించారు. బస్సు డ్రైవర్ భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వారిలో ఒకరిది ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోపవరం, మరో ఇద్దరిది భీమడోలు మండలం దుద్దేపూడి పంచాయతీ అన్నేవారిగూడెంగా పోలీసులు గుర్తించారు.


