యలమంచిలి: కేంద్ర ఎన్నికల ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది. ఎన్నికల సంఘం ఈ నెల 15న ఈ కార్యక్రమం ప్రారంభించింది. జూలై 14 వరకు 30 రోజుల గడువు ఇచ్చింది. సర్వే చేయడానికి ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్వో నియమించారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి అంటే ఒక్కో బీఎల్వోకు 750 నుంచి వెయ్యి వరకు ఓటర్లు ఉంటారు. బీఎల్వోలు మూడు పర్యాయాలు ఓటరును కలసి సర్వే చేయాలి. క్షేత్రస్థాయిలో ఇవేమీ జరగడం లేదు. ఒక్కో గ్రామంలో ఒక్కో రీతిలో సర్వే చేస్తున్నారు. కొందరు నాయకులతో కలసి బీఆల్వోలు ఒక ఇంటి వద్దనో లేదా ప్రభుత్వ కార్యాలయం వద్దనో కూర్చుని ఓటర్లను తమ వద్దకు రప్పించుకుని అక్కడే సర్వే చేస్తున్నారు. ఇంకొందరైతే నిబంధనలకు విరుద్ధంగా అంగన్వాడీ, డ్వాక్రా సీఏల సహకారం తీసుకుని వారితోనే సర్వే చేయిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 30 రోజులు గడువునిచ్చి సర్వే పారదర్శకంగా చేయాలని చెబితే అధికారులు హడావుడి చేయడంతో బీఎల్వోలు ప్రత్యామ్నాయ మార్గాలలో సర్వే చేయిస్తున్నారు. ఈ విధంగా మండలంలోని వడ్డిలంక గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద బీఎల్వో డ్వాకా సీఏతో సర్ పత్రాలు పూర్తి చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ కార్యాలయం వద్దనే సర్ పత్రాలు డ్వాక్రా సీఏతో పూర్తి చేయడం ఎంత వరకు సమంజసమని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్ ప్రశ్నించారు.


