తణుకు అర్బన్: ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. హామీలను అమలుచేయకపోగా చంద్రబాబు సర్కారు చేస్తున్న విధ్వంస పాలన, అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టే స్థాయికి దిగజా రారని విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీ నేతలు మాజీమంత్రి కారుమూరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. హైదరాబాద్లోని కారుమూరి నివాసానికి వెళ్లి ధైర్యంగా ఉండమని పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు. శనివారం మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, భీమవరం పార్టీ కోఆర్డినేటర్ చినిమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లు పార్టీ ఇన్చార్జ్ గుడాల గోపి, పార్టీ నేత యడ్ల తాతాజీ తదితరులు కారుమూరిని హైదరాబాద్లో కలిసి మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు రాక్షస పాలన ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.


