భీమడోలు: ఆగిన ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారి కురెళ్లగూడెం పెట్రోలు బంక్ శివారు పూళ్ల వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొప్పాకకు చెందిన కొమ్మ వీరమణికంఠ తన అక్క కుమారుడి లుంగీల ఫంక్షన్ ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలోని మేకల కొనుగోలు నిమిత్తం శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆటోలో డ్రైవర్ బొలగాని సత్యనారాయణతో పాటు నలుగురు బంధువులు కట్టా హరికృష్ణ, కొమ్మ వీరమణికంఠ, యవర్న సంతోష్కుమార్, వానపల్లి సూరిబాబు బయలుదేరారు. మార్గమధ్యమైన సంఘటన స్థలానికి వచ్చేసరికి ఆటోలో సాంకేతిక లోపం తలెత్తడంతో తెల్లవారుజామున 4.45 నిమిషాలకు రోడ్డు మార్జిన్లో ఆటో ఆపి సిగ్నల్ వేశారు. ఆటోలో నలుగురి కూర్చుని ఉండగా కట్టా హరికృష్ణ ఆటో పక్కనే నిలబడ్డాడు. ఆ సమయంలో తాడేపల్లిగూడెంలోని కడియద్దకు చెందిన ఐదుగురు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తుండగా కారుడ్రైవర్ అల్లశెట్టి మణికంఠ నిద్రమత్తు, నిర్లక్ష్యంతో రోడ్డు మార్జిన్లో ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆటో, కారులు పక్కనే లోతైన పంట బోదెలో పడ్డాయి. ప్రమాదంలో ఆటో పక్కనే ఉన్న కట్టా హరికృష్ణ(36) అక్కడిక్కడే మృతి చెందగా ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ వి.కృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కట్టా హరికృష్ణ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ తరలించారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హరికృష్ణకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. కొమ్మ వీరమణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరి మృతి.. నలుగురికి గాయాలు


