ఏలూరు (టూటౌన్): పెదవేగిలో నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మించాలని, ఓ.ఈ.ఆర్ పేరుతో ఆయిల్ పామ్ రైతులను కంపెనీలు దోపిడీ చేసే చర్యలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. జూలై 3,4,5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్లో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.5 % ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేటు (ఓ.ఈ.ఆర్)కు వ్యతిరేకంగా కోర్టులో ఆయిల్ పామ్ కంపెనీలు కేసు వేసి 17.5%కు తగ్గించాలని కోరడం దుర్మార్గమని విమర్శించారు. జూలై 3న ఏలూరులో జరుగుతున్న హాలో రైతన్న – చలో ఏలూరు కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్.లింగరాజు, పి.రామకృష్ణ, పంపన రవికుమార్, ఎం.ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు.


