దెందులూరు: గ్యాస్ పైపులైను వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన నలుగురు వ్యక్తులు దెందులూరులోని అక్షయపాత్రలో గ్యాస్ పైప్ లైన్ వెల్డింగ్ చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకుని గత నాలుగు రోజులుగా పనులు చేస్తున్నారు. గురువారం సాయంత్రం పైభాగంలో పనులు పూర్తి చేసి వెల్డింగ్ మెషీన్ను కిందకు దించుతుండగా, బీరా రవి ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న వైర్ల వైపు దాన్ని అందుకున్నాడు. దీంతో అతడు తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే రవిని దెందులూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


