భీమవరం : భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 20 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆయా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 79 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 2,990 మంది విద్యార్థులకు 2,373 మంది హాజరయ్యారన్నారు. అలాగే ఇంటర్మీడియెట్ (ఏసీఓఎస్ఎస్) పరీక్షకు 81 మందికి 68 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు..
జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో భాగంగా ఫస్టియర్ జనరల్ పరీక్షకు 672 మందికి 571 మంది, సెకండియర్ పరీక్షకు 8 మందికి ఇద్దరు హాజరయ్యారని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి జి.ప్రభాకరరావు తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): రెడ్క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్, ఎల్ఏ–4 హ్యాండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 2న గుంటూరులో మెగా కృత్రిమ చేతుల అమరిక శిబిరం నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. సోమవారం శిబిరం వాల్పోస్టర్ను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. సుమా రు రూ.30 వేల విలువైన అత్యాధునిక కృత్రిమ చేతులను ఉచితంగా అమరుస్తామన్నారు. జిల్లాకు చెందిన దివ్యాంగులు రిజిస్ట్రేషన్, మరిన్ని వివరాల కోసం రెడ్క్రాస్ భీమవరం కార్యాలయాన్ని లేదా మొబైల్ 79016 94488ను సంప్రదించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ బద్రిరాజు, వైస్ చైర్మన్ వి.కనకరాజు తదితరులు పాల్గొన్నారు.


