న్యూస్రీల్
సాగుకూ.. ఇబ్బందులే..
జీవనం దుర్భరం
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, భీమవరం : జిల్లాలో సుమారు 650 ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో 1.74 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు 50 వేలకు పైగానే ఉంటారు. స్కూల్ను బట్టి అడ్మిషన్, ట్యూషన్ ఫీజు, బుక్స్, యూనిఫాం, షూస్, కేర్ టేకింగ్, అదర్ యాక్టివిటీస్, ఏసీ క్యాంపస్, ట్రాన్స్పోర్టు.. అంటూ నర్సరీ నుంచే ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. తరగతిని బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైనే ఫీజులు ఉంటున్నాయి. డీజిల్ ధరల పేరిట స్కూల్ బస్సుల్లో ట్రాన్స్ పోర్టు చార్జీలను పెంచేశారు. హాస్టళ్లలో చదువుకునే వారికి మెస్, అద్దె, దోబీ తదితర చార్జీలు చెల్లించాలి. ఇప్పటికే చాలావరకు అడ్మిషన్లు జరిగిపోగా జూన్ రెండో వారం స్కూల్స్ రీఓపెన్ సమయంలోనే ఫస్ట్టర్మ్ ఫీజు, బుక్స్, యూనిఫాం, ట్రాన్స్పోర్టు చార్జీలు చెల్లించాలి. బుక్స్, యూనిఫాం బయట కొనుక్కుంటామంటే కుదరదు. యాజమాన్యాలు చెప్పిన భారీ మొత్తాలు చెల్లించి సంబంధిత స్కూల్స్ లోనే తీసుకోవాలి. విద్యాసంస్థ, తరగతులను బట్టి జూన్లో చెల్లించాల్సిన మొత్తం రూ.30 వేల నుంచి రూ.లక్షకు పైబడి ఉంటుంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న వారికి ఈ భారం మరింత ఎక్కువ.
సగటున రూ.40 వేల చొప్పున..
జిల్లాలోని 1.74 లక్షల మంది ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతుండగా సగటున ఒక్కొక్కరిపై రూ. 40 వేల చొప్పున రూ. 696 కోట్లు వరకు చెల్లించాలి. జిల్లాతో పాటు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో హాస్టల్స్, స్పెషల్ రూమ్స్లో ఉంటూ డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే వేల మంది స్థానిక విద్యార్థులను కలుపుకుంటే ఈ మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని అంచనా. పిల్లలకు హోంసిక్ ఉండకూడదన్న ఉద్దేశంతో కొందరు పేరెంట్స్ కళాశాలలకు దగ్గరకు జూన్లోనే మకాం మారుస్తుంటారు. దీంతో అద్దె ఇంటికి అడ్వాన్స్లు, షిఫ్టింగ్ చార్జీల రూపంలో అదనపు భారం పడుతుంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పైనా..
జిల్లాలోని 1,392 ప్రభుత్వ పాఠశాలల్లో 87,864 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే గత ప్రభుత్వం విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేస్తూ వచ్చింది. కూటమి హయాంలో కిట్లు పంపిణీ ఆలస్యమవుతోంది. చమురు సంక్షోభం పేరిట ఈసారి యూనిఫాం, బ్యాగు, షూలకు ఎగనామం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.3 వేలకు పైనే ఖర్చవుతుండగా ఈ మేరకు పేదలపై రూ.26.29 కోట్ల భారం పడనుంది.
ఏఐ సృష్టించిన చిత్రం
జూన్ వచ్చిందంటే.. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు, సాగు పెట్టుబడుల కోసం రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. పై తరగతుల ఆరంభానికి, సాగు ప్రారంభానికి నాంది పలికేది ఈ మాసమే. అప్పోసొప్పో చేసి తమ పిల్లల్ని బాగా చదివించాలని తల్లిదండ్రులు, పొలంలో ధాన్యం సిరులు పండించాలని రైతులు.. వెరసి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో అప్పుల తిప్పలు మొదలయ్యేది ఈనెల నుంచే.
‘పెట్టుబడి’ మాసం
గుబులు పుట్టిస్తున్న జూన్ నెల
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు..
సాగు పెట్టుబడుల కోసం రైతులు
జిల్లాలో 1.94 లక్షల మంది విద్యార్థులు
పుస్తకాలు, ఫీజుల కోసం రూ.1,000 కోట్లకు పైగా భారం
2.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
సాగు పెట్టుబడులకు రూ.258 కోట్ల వ్యయం
గోదావరి పశ్చిమ డెల్టాకు నీరు విడుదలయ్యింది. జిల్లాలోని 2.15 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. నారుమడులు సిద్ధం చేసిన నాటి నుంచి నాట్లు వేసే వరకు నెల రోజుల వ్యవధిలో నారుమడికి విత్తనాలు, పంట దమ్ము, పారలంకలు, పట్టిలాగడం, ఎరువులు, నాట్లు వేసేందుకు కూలీ ఖర్చులు కలిపి ఎకరానికి రూ.12,000 వరకు ఖర్చవుతుంది. ఈ మేరకు జూన్లో రైతులకు సాగు పెట్టుబడి వ్యయం రూ.258 కోట్ల వరకు ఉంటుంది.
పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. వీటి ప్రభావంతో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో టిఫిన్, మీల్స్పై ప్లేటుకు రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెంచేశారు. మార్కెట్లో బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. సామాన్య కుటుంబాలపై నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతుండటం వారి బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. ఈ తరుణంలో జూన్ నెల మొదలు కానుండటం సామాన్యులకు సెగపుట్టిస్తోంది. నెలవారీ ఈఎంఐలు, వడ్డీలను పక్కనపెడితే పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు, పెట్టుబడుల కోసం రైతులు లెక్కలు వేసుకుంటూ సొమ్ముల కోసం అప్పుల వేటలో ఎవరి ప్రయత్నాల్లో వారుంటున్నారు.


