● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు
● నరసాపురం, పాలకొల్లులో బీఎల్ఏలకు అవగాహన
పాలకొల్లు సెంట్రల్: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకునే కూటమి నేతల ఆగడాలను అరికట్టాలంటే, సర్(ఎస్ఐఆర్) విషయంలో ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ చాలా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శనివారం పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అధ్యక్షతన స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ అవగాహనా సదస్సు నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ ఇటీవల పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రతిపక్ష వ్యతిరేక ఓట్లను తొలగించడంతో ఏం జరిగిందో చూశామని, అందువల్ల బీఎల్ఏలు అందరూ పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. బీఎల్ఓలతో కలిసి పనిచేసి నియోజకవర్గంలోని 190 పోలింగ్ బూత్లలో వలస వెళ్లిన వారు, చనిపోయిన వారి వివరాలను సిద్ధం చేసుకుని తుది జాబితాను తయారు చేయించాలన్నారు.
మంత్రి విమర్శలను తిప్పికొట్టాలి :
స్థానిక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి మండల నాయకుడిపైనా ఉందన్నారు. గత కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల హయాంలో కొన్న స్థలాలే తప్ప టీడీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. జూన్ 4న మండల నాయకులు సమస్యలపై గళమెత్తాలని, జూన్ 10న కార్యాచరణ ఏర్పాటు చేసి, జూన్ 12న ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
బీఎల్ఏలకు సర్పై అవగాహన : అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ బీఎల్ఏలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై, సమస్యల పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్, పరిశీలకులు పేరిచర్ల నరసింహరాజు, జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, పోడూరు ఎంపీపీ సుమాంజలి, ఎంపీపీ వినుకొండ రవి, పట్టణ, మండల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, పెన్మెత్స ఏసురాజు, కొర్రపాటి వీరాస్వామి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ కర్రా జయసరిత పాల్గొన్నారు.
పాలకొల్లులో బీఎల్ఏల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు వేదికపై గుడాల గోపి, ఉమాబాల, మురళీకృష్ణంరాజు, శేషుబాబు, నాగబాబు, నర్సింహరాజు తదితరులు, సమావేశంలో పాల్గొన్న బీఎల్ఏలు, పార్టీ నాయకులు


