● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు
● ఉండిలో ఆక్వా రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నిరసన
ఉండి: ఆక్వారైతులు నట్టేట మునిగిపోతుంటే వారిని ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తుండడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఉండిలో ఆక్వా రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన, ఉండి సెంటర్ వరకు ర్యాలీ, మానవహారం కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఉండి ఇరిగేషన్ కార్యాలయం పక్కన వందలాది మంది ఆక్వారైతులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు సూచనల మేరకు మండలపార్టీ అధ్యక్షుడు పీవీఆర్కే ఆంజనేయరాజు, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకట్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సభకు విచ్చేసిన రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఆక్వా రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం
అనంతరం ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఫీడ్, సీడ్, విద్యుత్, ఆక్వా ధరల స్థిరీకరణ, ఎక్స్పోర్టర్ల సహకారం వంటివాటన్నింటినీ అందుబాటులో ఉండడంతో ఆక్వారైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఆక్వారైతులను రోడ్డుపాలు చేశారని అన్నారు. మేతల ధరలు పెంచడంతో పాటు సీడ్ ధరలు ఆకాశాన్నంటాయని విమర్శించారు. అంతేకాకుండా కొద్దిరోజుల క్రితం ఫీడ్ ధరలు విపరీతంగా పెంచడంపై రైతులు నిరసనలతో హోరెత్తడంతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం వస్తున్న సమాచారం సిండికేట్కు అందడంతో మేతల ధరల విపరీత పెంపును వాయిదా వేశారని అన్నారు. సిండికేట్కు కూటమి ప్రభుత్వం అండగా ఉందని వారు ఏం చెబితే అదే చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆక్వా రైతులు ఇబ్బందులు తనకు తెలియదని దారుణంగా అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు.
మేతల ధరలు తగ్గించాలి
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ ఆక్వారైతుల ద్వారా రాష్ట్రానికి సుమారుగా రూ.17 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు విదేశీ మారకద్రవ్యం లభిస్తున్నా ప్రభుత్వం ఆక్వారైతులకు ఎందుకు అండగా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిష్ ఫీడ్ (ముడిసరుకు) ధరలు ఆకాన్నంటుతున్నాయని చెబుతున్న మేతల తయారీదారులు అవి తగ్గిన తరువాత మేతల ధరలు తగ్గించకపోగా వాటిని విపరీతంగా పెంచి లాభాలు ఆర్జిస్తున్నారని అదే లాభాలతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారని విమర్శించారు. మేతల ధరలు తగ్గింపు, నాణ్యమైన సీడ్ ఇప్పిచడం, రొయ్యల ధరల స్థిరీకరణ, సబ్సిడీ విద్యుత్ యూనిట్ రూ.1.50కే ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇంత వరకు రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాటిపట్టి పెదవీరప్ప, గండ్రాజు రాజేష్ వర్మ, వేగేశ్న జయరామకృష్ణంరాజు, ముదునూరి ప్రసాదరాజు, జామి హైమావతి, నంద్యాల సీతారామయ్య, కరిమెరక మల్లికార్జున, యేడిద వెంకటేశ్వరరావు, గలావిల్లి ధనుంజయ, రామరాజు, బడుగు బాలాజీ, గులిపల్లి అచ్చారావు, జీ సుందర్కుమార్, గుండు నాగేశ్వరరావు, పాటూరి దొరబాబు, అంగర రాంబాబు, రాయి సతీష్, గుండాబత్తుల సుబ్బారావు, వర్రే ముసలయ్య, శేసాద్రి శ్రీను, ముదునూరి సుబ్బరాజు, వేగేశ్న రాంబాబురాజు, బుద్దర్రాజు రంగరాజు, దానం విద్యాసాగర్, బులుసు రామకృష్ణ, ధనరాజు, దండు రాము తదితరులు పాల్గొన్నారు.


